అందరి ముందు బట్టలూడదీసి కొడ్తా: మహిళపై ఎమ్మెల్యే
ముంబై: ఓ మహిళను అసభ్యంగా దూషించినందుకు శివసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పైన మహారాష్ట్ర రాజధాని ముంబైలో కేసు నమోదయింది. ఎమ్మెల్యే ప్రకాశ్ బాలా సావంత్ ఓ మహిళను బట్టలిప్పి కొడతానని దూషించాడు. సబర్బన్ బాంద్రాలోని హౌసింగ్ సొసైటీ విషయమై ఓ మహిళకు, ఎమ్మెల్యేగా వాగ్వాదం జరిందని, ఈ సమయంలో అతను దూషించాడని పోలీసులు చెప్పారు.
'అందరి ముందు నీ బట్టలిప్పి కొడతా' అంటూ సదరు ఎమ్మెల్యే మహిళను దూషించాడట. మహిళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేసుకున్నట్లు ఖేర్వాడీ పోలీసులు సోమవారం రాత్రి తెలిపారు. బాధిత మహిళ వయస్సు యాభై ఏళ్ల వరకు ఉంటుంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పైన 504, 506, 509 సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశారు.
ప్రకాశ్ బాలా సావంత్ బాంద్రా (తూర్పు) నియోజకవర్గం ఎమ్మెల్యే. సబర్బన్ బాంద్రాలోని గాంధీ నగర్ హౌసింగ్ సొసైటీ రీడెవలప్మెంట్ విషయమై ఎమ్మెల్యే, మహిళ మధ్య వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. వీరిద్దరు కూడా కమిటీ మెంబర్లు. రీ డెలవప్మెంట్ కోసం ఏ బిల్డర్ను తీసుకోవాలనే విషయమై వీరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, దీనిపై మాట్లాడటానికి ఎమ్మెల్యే అందుబాటులో లేరట.
మరోవైపు, అర్ధరాత్రి దాటిన తర్వాత బార్లలో మద్యం తాగొద్దని చెప్పిన పోలీసులపై ఓ ప్రజాప్రతినిధి వారిపై చిందులు తొక్కిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వారిని వెంబడించి మరీ తిట్ల పురాణం చదివి వారి మీద చేయి చేసుకున్నాడు. పోలీసుల వద్ద ఉన్న కెమెరాను లాక్కున్న ఆయన, అసెంబ్లీలో గుడ్డలూడదీసి కొడతానని వారిని హెచ్చరించాడు. ఓ ప్రజాప్రతినిధి ఈ విధంగా వ్యహరించడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హుంగుండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్(42) తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి మంగళవారం రాత్రి పుట్టిన రోజు చేసుకుంటున్నారు. ఆ పార్టీలో కొందరు రౌడీ షీటర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. విఠల్ మాల్యా రోడ్డులోని యుబి సిటీ 16వ అంతస్తులో లాంజ్ బార్లో అర్ధరాత్రి దాటిన తర్వాతా కూడా పెద్ద సౌండుతో పాటలు, మద్య సేవనం కొనసాగుతున్నాయి.
నగరంలో రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లకు అనుమతి ఉండగా.. ఇది రాత్రి ఒంటి వరకు కొనసాగింది. దీంతో ఆ సౌండును, గందరగోళాన్ని భరించలేని చుట్టపక్కల వాళ్లు కబ్బన్ పార్క్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ హ్యాండ్ కెమెరాతో అక్కడికి వెళ్లారు.
అక్కడ జరుగుతున్నదంతా చిత్రీకరించారు. దీంతో పోలీసులను చూసిన ఆ ఎమ్మెల్యేకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ‘ఏం చేస్తున్నారు. నేనెవరో తెలుసా' అంటూ వాళ్ల చేతిలోని కెమెరా లాక్కున్నారు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్లు తిట్టిన ఆ ఎమ్మెల్యే.. వారిపై చేయి చేసుకున్నాడు. ఇంకా వారిని అసెంబ్లీలో గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించి మరీ పంపించేశాడా ప్రజాప్రతినిధి.