షాక్: దుస్తులు చించేసి.. డీఎస్పీని రాళ్లతో కొట్టి చంపారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఆందోళనకారులు, ఉగ్ర సానుభూతిపరులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా డీఎస్పీపైనే దాడికి పాల్పడ్డారు. దీంతో తనను తాను కాపాడుకునేందుకు కాల్పులు జరిపారు సదరు అధికారి. కాగా, మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఆయనను రాళ్లతో కొట్టి చంపారు.
ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిప్యూటీ సూపరిండెంట్(డీఎస్పీ)గా పనిచేస్తున్న మహ్మద్ ఆయుబ్ పండిత్ గురువారం రాత్రి జమియా మసీదు బయట ఫొటోలు తీసుకుంటున్నారు. దీంతో ఆందోళనకారులు ఆయనను పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు ఆయుబ్ తన తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు ఆందోళనకారులు గాయపడినట్లు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించగా అడ్డుకున్న ఆందోళనకారులు ఆయనపై దాడి చేశారు. అతడు ధరించిన పోలీసు దుస్తులను చించేసి, ఆయనను రాళ్లతో కొట్టి చంపారు. అంతటితో ఆగని ఆందోళనకారులు ఆ ప్రాంతంలోని పోలీస్ పికెట్లను ధ్వంసం చేశారు.
అల్లర్ల సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా, మసీదుకు సమీపంలో ఆందోళనకారుల రాళ్లదాడిలో చనిపోయిన పోలీస్ అధికారి మృతదేహం కన్పించింది. దీంతో ఆయుబ్ హత్యను ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
'మిర్వాజ్ ఉమర్ ఫరూక్ అక్కడ ప్రసంగించనుండడంతో.. ప్రార్థనల వద్ద విధులు నిర్వహించేందుకు ఆయన వెళ్లారు’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కాగా, జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగం ట్విట్టర్ లో స్పందిస్తూ.. 'విధి నిర్వహణలో మరో అధికారి తన ప్రాణాలను త్యాగం చేశారు. డిప్యూటీ ఎస్పీ అయూబ్ పండిత్ను గురువారం రాత్రి అల్లరి మూకలు కొట్టి చంపేశాయి’ అని పేర్కొంది.












Click it and Unblock the Notifications