యూపీలో దారుణం: హిందూ బాలికతో పారిపోయాడని.. ముస్లిం యువకుడి బంధువుపై దాడి చేసి...
ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్లో ఓ ముస్లింని కొందరు హిందూత్వ అతివాదులు కొట్టి చంపారు.
మీరట్: ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్లో ఓ ముస్లింని కొందరు హిందూత్వ అతివాదులు కొట్టి చంపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే.. ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి గత వారం ఇంటి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన హిందూత్వ సంస్థ సభ్యులు గులాం మహమ్మద్(55)పై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిపోయిన జంట ఎక్కడ ఉన్నారో చెప్పాలంటే ఆయనపై దాడి చేశారు.
ఆయన వారికి ఎలాంటి వివరాలు తెలుపలేకపోవడంతో వారు ఆయనను చితకబాదారని, తీవ్రంగా గాయపడిన ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందారని పోలీసులు తెలిపారు. స్థానిక మీరట్ డీఐజీ సంఘటనా స్థలాన్ని సందర్శించి వెంటనే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మృతుడి కుమారుడు నిందితులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తుతెలియని ఆరుగురు హిందూవాహిని సంస్థ సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్టు అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే, ఈ ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని, గత ఎస్పీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న పోలీసులే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని హిందూ యువవాహిని సంస్థ పేర్కొంది.