జైల్లో కత్తులు, మొబైల్స్, సిమ్ కార్డులు స్వాధీనం
మంగళూరు: మంగళూరు సెంట్రల్ జైల్లో భారీగా మొబైల్స్, కత్తులు, సిమ్ కార్డులు బయటపడ్డాయి. ఖైదీలు విచ్చలవిడిగా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారని వెలుగు చూసింది. కర్ణాకటలోని మంగళూరు సెంట్రల్ జైలులో ఇంకా సోదాలు చేస్తున్నామని మంగళూరు నగర పోలీసు కమిషనర్ మురగన్ చెప్పారు.
గత సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో మంగళూరు సెంట్రల్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్ లో మాఫియా ముఠా సభ్యులు, కరుడుకట్టిన నేరస్తులు మాడూర్ యూసఫ్, అతని అనుచరుడు గణేష్ శెట్టి (దావూద్ అనుచరులు) హత్యకు గురైనారు.
విక్కి శెట్టి అనుచరులు కత్తులతో అతి దారుణంగా వీరిద్దరిని హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళూరు సెంట్రల్ జైలులో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 కత్తులు, 16 మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, మొబైల్ బ్యాటరీలు, చార్జర్లు, ఎలక్ట్రికల్ వైర్లు, కారం పోడి స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు అంటున్నారు. మంగళూరు సెంట్రల్ జైల్లో కరుడుకట్టిన నేరస్తులు శిక్ష అనుభవిస్తున్నారు. జైలు సిబ్బంది సహకారం లేకుండా మారణాయుధాలు, మొబైల్ ఫోన్లు నేరస్తుల దగ్గరకు చేరే అవకాశం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.
దర్యాప్తు కొనసాగుతున్నది అధికారులు తెలిపారు. అంతకు ముందు దుబాయ్ లో తలదాచుకున్న మాఫియా డాన్ విక్కి శెట్టి మంగళూరులోని విలేకరులకు ఫోన్ చేసి మాట్లాడాడు. తన టార్గెట్ యూసఫ్ అని, పొరబాటున గణేష్ శెట్టి గొడవలో అంతం అయ్యాడని వివరణ ఇచ్చుకున్నాడు.