మోడీ 2.0 ఏడాది పాలనపై రిపోర్టు: సక్సెస్ అయ్యారా.. ఫెయిల్ అయ్యారా..?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి అయ్యింది. అయితే ప్రధాని నరేంద్రమోడీ ఈ ఏడాది కాలంలో పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి వరకు మోడీ రెండో సారి అధికారంలోకి రావడం కష్టమే అన్న భావనలో చాలామంది ఉన్నసమయంలో తిరిగి అఖండ మెజార్టీతో గెలిచి రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ప్రధానిగా రెండో దఫాలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న మోడీ ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఒక్కసారి చూద్దాం.

జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు
రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం చేయని సాహసం మోడీ ప్రభుత్వం చేసింది. అదే జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 మరియు 35ఏ రద్దు. కర్తాపూర్ సాహిబ్ కారిడార్, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ఫోకస్, మహిళల సంరక్షణ కోసం తీసుకున్న చర్యలు, విపత్తులను డీల్ చేసిన విధానాలకు మంచి మార్కులు పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకమైన నిర్ణయమని జాతీయ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపొందించడం చరిత్రలో లిఖించదగ్గదని బీజేపీ చెబుతోంది. ఇది మోడీ-షా ద్వయం విజయమని బీజేపీ అభివర్ణిస్తోంది.

కోవిడ్-19ను డీల్ చేయడంపై ప్రశంసలు
ఇక దేశాన్ని కుదిపేసిన కరోనావైరస్ను డీల్ చెయ్యడంలో మోడీ ప్రభుత్వం విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ మోడీ పాలనపై విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. కరోనావైరస్ దేశ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసిన నేపథ్యంలో తిరిగి గాడిన పెట్టేందుకు మోడీ సర్కార్ తీసుకున్న ఉద్దీపన చర్యలు భేష్ అని పలువురు కొనియాడుతున్నారు. కరోనావైరస్ను భారత్ ఎదుర్కొన్న తీరు ముఖ్యంగా మోడీ తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొనియాడింది. ఇక సహజ విపత్తులు వచ్చిన సమయంలో ప్రభుత్వం స్పందించిన తీరు.. నష్ట నివారణ చర్యలు చేపట్టిన విధానం కూడా బాగున్నాయనే చెప్పాలి. వాయు, మహా, బుల్బుల్, అంఫన్ తుఫాన్లు దేశంలో విరుచుకుపడిన సమయంలో మోడీ ప్రభుత్వం స్పందించి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకుంది. ఇక దాయాది దేశం పాకిస్తాన్లోని కర్తాపూర్ గురుద్వారకు లైన్ క్లియర్ చేయడం కూడా మోడీ ప్రభుత్వం విజయంలో ఒక భాగం. అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వంతో కర్తాపూర్ కారిడార్ అగ్రీమెంట్పై 2019 అక్టోబర్ 24 సంతకాలు చేసింది.
Recommended Video

అయోధ్య రామమందిరం ట్రస్టు ఏర్పాటు
మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో మరొక అంశం ఎన్ఐఏ చట్టంలో సవరణలు తీసుకురావడం. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు తీసుకురావడం చేసింది. ఇక పారామిలటరీ బలగాలకు భరోసా కల్పిస్తూ పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదంతా ఇలా ఉంటే ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చి ముస్లిం మహిళలకు అండగా నిలిచిందని బీజేపీ చెబుతోంది. అదే సమయంలో సుప్రీంకోర్టు అయోధ్యపై ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అయోధ్య రామమందిర నిర్మాణంకు ట్రస్టును కూడా త్వరతగతిన ప్రకటించింది. ఇక అగ్రదేశాల అధినేతలను భారత్కు తీసుకురావడం అదే సమయంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

సీఏఏ పై భగ్గుమన్న దేశం
ఇక మోడీ ప్రభుత్వం విజయాలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంది. సీఏఏ అంశంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ నిర్ణయంతో ఒక వర్గంవారు రోడ్డెక్కి తమ నిరసనను తెలిపారు. ఇక ఈశాన్య రాష్ట్రాలు అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భగ్గుమన్నాయి. దీంతో ఎన్డీఏకు అప్పటి వరకు మద్దతుగా నిలిచిన పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి మద్దతును ఉపసంహరించుకున్నాయి.












Click it and Unblock the Notifications