అమిత్ షా వచ్చారు.. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి: ఎంపీలకు మోడీ హెచ్చరిక!
పార్లమెంటు సమావేశాలకు డుమ్మా కొట్టవద్దని ఇప్పటికే హెచ్చరించినా, కొందరు ఎంపీల తీరులో మార్పు రాలేదన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో గురువారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, అమిత్ షా హాజరయ్యారు. రాజ్యసభకు ఎంపికైన తర్వాత అమిత్ షా హాజరైన తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి మోడీ మాట్లాడారు.
రాజ్యసభలో ఇప్పుడు షా అడుగుపెడుతున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని బీజేపీ ఎంపీలను ప్రధాని మోడీ హెచ్చరించారు. పార్లమెంటు సమావేశాలకు డుమ్మా కొట్టవద్దని ఇప్పటికే హెచ్చరించినా, కొందరు ఎంపీల తీరులో మార్పు రాలేదన్నారు. అమిత్ షా రాకతో వారందరికీ విశ్రాంతి రోజులు పూర్తయ్యాయని గుర్తెరగాలన్నారు.

అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారని ఎంపీలను ప్రశ్నించిన మోడీ.. మీరైనా.. నేనైనా పార్టీ హైకమాండ్ ముందు ఏమీ కామని గుర్తు చేశారు. పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కావడం వల్ల పార్లమెంటులో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు.
ఎంపీల గైర్హాజరు విషయంపై ఈ నెల ఆరంభంలోను అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విప్ జారీ చేస్తే తప్ప వీరు సభకు హాజరుకావడం లేదంటూ అప్పట్లో ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలంతా సభలో లేకపోవడంతో వెనుకబడిన తరగతులకు సంబంధించిన బిల్లు విషయంలో విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాయని ఆ సందర్భంగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications