ఎల్లుండి కేంద్ర కేబినెట్ విస్తరణ?: వైఎస్ జగన్కు లాస్ట్ కాల్: బీఎల్ సంతోష్ బుజ్జగింపులు?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ సర్కార్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కేబినెట్ను విస్తరించడానికి ముహూర్తం పెట్టారు. ఎల్లుండి అంటే..8వ తేదీన కేంద్ర కేబినెట్ను విస్తరించడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. బుధవారం నాడే విస్తరణకు పూనుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఒక రోజు వెనక్కి జరిపినట్లు సమాచారం.
కేబినెట్ బెర్తులు ఫైనల్..లిస్ట్ రెడీ: ఈ సాయంత్రమే మోడీ ముద్ర: ప్లస్సులూ, మైనస్సులు
మంత్రివర్గ కూర్పుపై జాప్యం..
మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలి? ఎన్డీఏలోని ఏ భాగస్వామ్య పక్షానికి ఎలాంటి పోర్ట్ఫోలియోలను కేటాయించాలి? తటస్థ పార్టీల వైఖరేమిటీ? అనే విషయంపై ఇక తుది విడతగా చర్చించబోతోన్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. ప్రధాని మోడీ ఈ సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్లతో సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు.
వైసీపీకి చివరి ఛాన్స్..
దేశ రాజకీయాల్లో తటస్థ పార్టీలుగా గుర్తింపు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ కోసం చివరి విడత ప్రయత్నాలు సాగిస్తున్నట్లు జాతీయ మీడియా ప్రత్యేక కథనాలను వెలువడిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోపు మరోసారి కేంద్ర కేబినెట్ను విస్తరించే అవకాశాలు లేవని, ఇదే చివరి అవకాశం అంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆయా పార్టీలకు ఫోన్ చేసినట్లు జాతీయ మీడియా అంచనా వేసింది. ఎన్డీఏలో ఇప్పుడు చేరకపోతే.. ఆ తరువాత కూటమిలో భాగస్వామిగా ఉన్నా మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చనే సంకేతాలను పంపించినట్లు సమాచారం.
ప్రతికూల స్పందనే..
ప్రత్యేకించి- దేశ రాజకీయాల్లో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ కోసం ఎన్డీఏ పెద్దలు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. కీలక పోర్ట్ఫోలియోలను కేటాయిస్తామనే భరోసా సైతం ఇచ్చినట్లు జాతీయ మీడియా చెబుతోంది. దీనిపై తటస్థ పార్టీల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది స్పష్టంగా తెలియరావట్లేదు. ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ తాము తటస్థంగానే ఉంటామంటూ పరోక్ష సంకేతాలను ఇచ్చిందని, ఈ విషయంలో వైసీపీ కొంత డైలమాలో పడిందని అంటోన్నారు.
Recommended Video
హోదా కోసం పట్టు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇస్తే.. బేషరతుగా మద్దతు ఉంటుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కొంత పట్టువిడుపులను ప్రదర్శించాలంటూ వైసీపీకి సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీని బుజ్జగించే బాధ్యతను కర్ణాటకకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు అప్పగించారనే ప్రచారం కూడా చక్కర్లు కొడుతోంది. దీనిపై వైసీపీ తన మాటకు కట్టుబడే ఉందని చెబుతున్నారు. దీనిపై ఇఫ్పటికే బీఎల్ సంతోష్ ఫోన్ ద్వారా సంప్రదించినట్లు సమాచారం.