వంట మనిషి, వ్యక్తిగత సిబ్బందితో ఢిల్లీకి మోడీ
న్యూఢిల్లీ: కాబోయే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి వీడ్కోలు చెప్పి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. తనతో పాటు దాదాపు దశాబ్ద కాలంగో తనకు వంటలు చేసి పెడుతూ తన బాగోగులు చూసుకుంటున్న వంట మనిషి బద్రిని, వ్యక్తిగత సహాయ సిబ్బంది దినేష్, ఠాకూర్, ఓపి సింగ్లను మోడీ తన వెంట ఢిల్లీకి తీసుకుని వచ్చారు.
ఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నివాస భవనం ఇక మోడీ నివాసం కానుంది. మోడీతో పాటు ఆయన సన్నిహిత సహచరుడు అమిత్ షా కూడా ఢిల్లీకి వచ్చారు. నరేంద్ర మోడీ సోమవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గురువారం సాయంత్రం ఆయన అహ్మదాబాద్ విమానాశ్రయంలో గుజరాత్ ప్రజలకు వీడ్కోలు చెప్పారు. అంతకు ముందు ఆయన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకే సొంతమైన కుర్తాలను, గడియారాలను మూట గట్టుకుని ఆయన న్యూఢిల్లీలోని గుజరాత్ భవన్కు చేరుకున్నారు.
యువకుడిగా ఉన్నప్పుడే ఇంటిని వదిలిపెట్టిన మోడీకి తీసుకుని రావడానికి పెద్దగా వ్యక్తిగతమైన వస్తువులు లేవు. యోగా, వ్యాయామం చేసేందుకు అవసరమైనవాటిని ఆయన తన వెంట తెచ్చుకున్నారు. తన పుస్తకాలు, గాడ్జెట్స్ కూడా మోడీ నివాసానికి చేరనున్నాయి.
ముఖ్యమంత్రిగా తనకు వచ్చే వేతనాన్ని నరేంద్ర మోడీ వదిలేసి వచ్చారు. 13 ఏళ్ల తన వేతనాన్ని అహ్మదాబాద్లోని ముఖ్యమంత్రి సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది చదువులకు నిధి కింద ఆయన సమకూర్చారు.