అందుకే భార్యను వదిలేశాడు..! మోడీకి చురకలంటించిన బెహన్ జీ..
రాజస్థాన్లో ఆల్వార్ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాయా మొసలికన్నీరు కారుస్తున్నారని మోడీ విమర్శించగా... ప్రధాని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బెహన్జీ మండిపడ్డారు. బీజేపీ మహిళా ప్రతినిధులు మోడీతో తమ భర్తలు మాట్లాడితే తమ పరిస్థితి ఏంటా అని కలవరానికి గురవుతున్నారని సటైర్ వేశారు మాయావతి.
అందుకే భార్యను వదిలేశాడు
ప్రధాని మోడీకి మహిళలంటే గౌరవంలేదని, ఆ కారణంగానే ఆయన తన భార్యను వదిలేశారని మాయావతి ఆరోపించారు. 'బీజేపీకి చెందిన వివాహిత మహిళా నేతలు ప్రధాని మోడీ చుట్టుపక్కల తమ భర్తలు కనిపిస్తే భయపడిపోతున్నారు. ఒకవేళ మోడీ వారిని కలిస్తే తమ భర్తలు కూడా ఆయనలాగే భార్యల్ని వదిలేస్తారని భయపడుతున్నార'ని చురకలంటించారు.
రాజకీయ లబ్ది కోసం
ఆల్వార్ గ్యాంగ్ రేప్ కేసులో మౌనం వహించిన ప్రధాని నరేంద్రమోడీ.. ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని మాయ ఆరోపించారు. దళితుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఆయన వారిపై కపట ప్రేమ చూపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా రోహిత్ వేముల, ఉన్నవ్ ఘటనల్ని ప్రస్తావించిన బీఎస్పీ అధినేత్రి .. ప్రధాని చర్య సిగ్గుచేటని అన్నారు. రాజకీయ స్వార్థం కోసం భార్యను వదిలేసిన వ్యక్తి.. ఇతరుల అక్కచెల్లెళ్లను భార్యలను ఎలా గౌరవిస్తారని బెహన్ జీ ప్రశ్నించారు.
ఈసీపై మాయా ఆగ్రహం
ఎన్నికల సంఘం తీరుపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, హింసకు పాల్పడుతున్న రాజకీయ నేతలపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని మాయావతి సుప్రీంకోర్టును అభ్యర్థించారు.