అవినీతిపరులకు ఇక ఏడేళ్ల జైలు: రెండేళ్లు పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడటాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నేరాల జాబితాలో చేర్చింది. అంతేగాక, అవినీతికి పాల్పడిన వారికి విధించే గరిష్ఠ శిక్షను ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల జైలు శిక్ష నుంచి ఏడేళ్ల జైలుకు పెంచుతూ అవినీతి నిరోధక చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది.
లంచం ఇచ్చిన వారికీ, లంచం తీసుకున్న వారికీ.. ఇద్దరికీ విధించే శిక్షను కఠినతరం చేస్తూ 1988నాటి ఈ చట్టాన్ని సవరించనున్నారు. అవినీతి కేసుల్లో కనిష్ట శిక్షను కూడా ప్రస్తుతం ఉన్న ఆరు నెలల జైలు నుంచి మూడేళ్ల జైలుకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
అవినీతి కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయడం కోసం రెండేళ్ల కాలపరిమితి విధించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం అవినీతి నిరోధక చట్టం కింద దాఖలయిన కేసుల విచారణ సగటున ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా విచారణ జరపడానికి లోక్పాల్ లేదా లోకాయుక్త నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆ ప్రకటన వివరించింది.
కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించిన సవరణలు రాజ్యసభలో పెండింగ్లో ఉన్న అవినీతి నిరోధక (సవరణ) బిల్లు- 2013లో భాగంగా ఉంటాయి. తమ ఉద్యోగులు లేదా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వకుండా వాణిజ్య సంస్థలకు కొన్ని మార్గదర్శకాలను కూడా ఈ బిల్లులో చేర్చారు. ఇప్పటి వరకు జిల్లా కోర్టులకు మాత్రమే ఉన్న ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ట్రయల్ కోర్టు (ప్రత్యేక జడ్జి)కు కల్పించే ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.