ఏపీబీ-సీ ఓటరు సర్వే: మళ్లీ బీజేపీదే విజయం, మోడీయే ప్రధాని, ఇటీవల ఓడిన రాష్ట్రాల్లో కమలమే
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను బీజేపీ చేజార్చుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో ఎస్పీ, బీఎస్పీ, ఇతర పార్టీలు కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారంలో ఉండటం సాధారణ విషయం కాదు.
మూడుసార్లు అధికారంలో ఉండి ఓడిపోవడం సహజమే. అయితే, లోకసభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి ఒకింత అసంతృప్తి మిగిల్చేవని చెప్పవచ్చు. అయితే, 2019లో తిరిగి నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని, ఎన్డీయే మెజార్టీ సీట్లు దక్కించుకుంటుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా, ఏబీపీ - సీ ఓటరు సర్వే కూడా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చింది.
మళ్లీ మోడీదే విజయం
2014లో మోడీ నేతృత్వంలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత ఓటు బ్యాంక్ కోసం కాకుండా దేశ భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ సంస్కరణలు చేపడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మోడీ ప్రజలకు తాయిలాలు ప్రకటించడం పక్కన పెట్టేసి దేశం కోసం పని చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే రాజకీయం కూడా చేయాలనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు నాలుగు నెలలు ఎన్డీయే కూడా తాయిలాలు ప్రకటించే అవకాశాలు కొట్టి పారేయలేం. ఈ విషయం పక్కన పెడితే ఏబీపీ - సీ ఓటరు సర్వేలో ఎన్డీయేకు 291 సీట్లు వస్తాయని తేలింది.
యూపీలో ఎస్పీ, బీఎస్పీ దోస్తీ దెబ్బనే ఎక్కువ
ఏబీపీ - సీ ఓటరు సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఉత్తర ప్రదేశ్లో బీజేపీని భారీగా దెబ్బతీసే అవకాశముంది. గత ఎన్నికల్లో బీజేపీకి యూపీలోనే 70కి పైగా స్థానాలు వచ్చాయి. ఈసారి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బీజేపీకి 247 సీట్లు వచ్చే అవకాశముంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు 272. ఎన్డీయేకు 247 స్థానాలు వస్తే మళ్లీ కొత్త మిత్రుల కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. మేజిక్ ఫిగర్కు 25 స్థానాలు తగ్గుతాయి.
యూపీలో ఇలా సీట్లు
ఈ సర్వే ప్రకారం ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలకు 50 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ 28 సీట్లలో గెలిచే అవకాశముంది. అంటే 2014లో గెలిచిన సీట్ల కంటే 43 సీట్లు తక్కువ. చతుర్ముఖ పోటీ ఉంటే మాత్రం ఎన్డీయేకు లాభించనుంది. బీఎస్పీ, ఎస్పీ పొత్తు, మహారాష్ట్రలో శివసేన ప్రభావం బీజేపీపై ప్రభావం పడనుంది. ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు భారతంలో ఎన్డీయేకు మంచి సీట్లు వచ్చే అవకాశముంది.
ఒడిశా, ఈశాన్యంలో ఎన్డీయే హవా
ఒడిశా రాష్ట్రంలో 21 లోకసభ స్థానాలకు గాను బీజేపీకి 15, పశ్చిమ బెంగాల్లో 42 సీట్లకు గాను 9 సీట్లు, బీహార్లో 40 సీట్లకు గాను 35 సీట్లు ఎన్డీయేకు వచ్చే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రాల్లోని 25 లోకసభ స్థానాలకు గాను 19 సీట్లు ఎన్డీయే గెలుచుకునే అవకాశముందని ఈ సర్వేలో వెల్లడైంది.
ఇక, గుజరాత్లోని 26 స్థానాల్లో బీజేపీ 24 గెలుచుకోనుంది. మహారాష్ట్రలో మాత్రం బీజేపీకి దెబ్బ తగలనుంది. ఇక్కడ 48 స్థానాలు ఉండగా వాటిల్లో 18 స్థానాల్లోనే గెలుచుకోనుంది.
ఇటీవల ఓడిన మూడు రాష్ట్రాల్లో బీజేపీకే ఎక్కువ
ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన బీజేపీకి లోకసభ ఎన్నికల్లో మాత్రం సీట్లు అధికంగా వస్తాయని సీ ఓటర్ సర్వే సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్లో మొత్తం 29 లోకసభ స్థానాలు ఉండగా అందులో బీజేపీ 23, రాజస్థాన్లోని 25 సీట్లలో 19 సీట్లు, ఛత్తీస్గఢ్లోని 11 సీట్లలో అయిదు స్థానాలను బీజేపీ దక్కించుకోనుంది.
దక్షిణాదిన యూపీఏదే హవా
దక్షిణ భారత దేశంలో మాత్రం ఎన్డీఏకు నిరాశ మిగలనుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కలిపి మొత్తం 129 లోకసభ సీట్లు ఉన్నాయి. ఇందులో 15 స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ గెలవనుంది. తమిళనాడులో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్న డీఎంకేకి అధికంగా సీట్లు రానున్నాయి. దక్షిణ భారత్లో యూపీఏదే పై చేయి కానుంది. అయితే మొత్తంగా యూపీలో ఎస్పీ, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేస్తే ఎన్డీయేకు 291, కలిసి పోటీచేస్తే ఎన్డీయేకు 247 సీట్లు వస్తాయి. యూపీఏకు 171 సీట్లే రానున్నాయి. దీంతో ఎన్డీయేకే అధికారంలోకి వచ్చి, మోడీ ప్రధాని అయ్యే ఆస్కారం ఉంది.