అయోధ్య: రామ జన్మభూమిలో 'రామ మ్యూజియం'
న్యూఢిల్లీ: రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో కేంద్ర ప్రభుత్వం 'రామ మ్యూజియం' పేరుతో ఓ హైటెక్ మ్యూజియంను నిర్మించాలనే ఆలోచనలో ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసున్న నేపథ్యంలో అయోధ్యలో రామమందిరం నిర్మించాలని గత కొంతకాలంగా హిందూత్వవాదులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
'రామాయణ సర్క్యూట్'గా భావించే ప్రాంతంలో రామ మందిరం స్ధానంలో రామ మ్యూజియం నిర్మిస్తే హిందూత్వవాదుల డిమాండ్ను కొంతకాలం పక్కన బెట్టాలన్నది మోడీ ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ మాట్లాడుతూ ప్రతిపాదిత 'రామాయణ సర్క్యూట్'లో భాగంగా అయోధ్యలో మ్యూజియం నిర్మిస్తామని చెప్పారు.
అయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో దీనిని ఏర్పాటు చేయడంలేదని, ప్రత్యేకమైన నిర్మాణమని అన్నారు. సంపూర్ణ ప్రణాళికతోనే ఈ మ్యూజియాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాముడు, రామాయణ మహిమ గురించి ఈ మ్యూజియం ద్వారా ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది రామ మ్యూజియం పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
ఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షర థామ్ ఆలయం తరహాలో ఈ మ్యూజియం ఉంటుందని మంత్రి మహేష్ శర్మ తెలిపారు. రామ మందిరం నిర్మాణంపై ఇటీవలే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలోనే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని అన్నారు.
'రామ మందిరం నిర్మాణం బీజేపీ హయంలో జరగకపోతే కాంగ్రెస్ పాలనలో జరుగుతుందా? ములాయం లేదా మాయావతి కడతారా? బీజేపీ పాలనలోనే రామమందిరం నిర్మిస్తాం. ఈరోజు కాకపోతే రేపు. రేపు కాకపోతే తర్వాత రోజు. మా ప్రభుత్వానికి ఏడాది మాత్రమే పూర్తయింది. ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉంటాం' అని సాక్షి మహరాజ్ అన్నారు.
ఇక రామమందిరం నిర్మించకుంటే, నరేంద్ర మోడీ సర్కారు కూడా కూలిపోతుందని వీహెచ్పీ జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సురేంద్ర జైన్ మాట్లాడుతూ గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన భారీ మెజార్టీ కేవలం కాషాయం ద్వారానే వచ్చిందని దేశాన్ని అభివృద్ధి చేయడం వల్ల కాదని అన్నారు.