తెల్సింది: రాజధానిపై వెంకయ్య, మోడీపై రాహుల్ సెటైర్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం స్పందించారు. ఏపీ రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికే వదిలేశామని అన్నారు. విజయవాడను రాజధానిగా చేశారని తెలిసిందని, రాజధాని పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం తాము నడుచుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధానికి కేంద్రం నుండి అందాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని చెప్పారు.
నరేంద్ర మోడీ పైలన పైన కూడా వెంకయ్య స్పందించారు. వంద రోజుల్లోనే మోడీ మార్కు పాలన చూపించారని అన్నారు. మోడీ వంద రోజుల పాలన చాలా బాగుందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. యూపీఏ హయాంలో అన్నీ లోట్లే అన్నారు.
మోడీపై రాహుల్ సెటైర్లు
నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సందించారు. దేశంలో సమస్యలను గాలికి వదిలేసి, ప్రధాని జపాన్లో డ్రమ్స్ వాయించుకుంటున్నారని విమర్శించారు. దేశంలో నీరు, విద్యుత్, ధరలు వంటి సమస్యలు తీవ్రమవుతుంటే, ప్రధాని విహారయాత్రకు వెళ్ళారన్నారు. రాహుల్ తన నియోజకవర్గం అమేథిలో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను మరిచిపోయారని, మోడీ పాలనకు వంద రోజులు పూర్తయిన, ఏం ఫలితం లేదన్నారు.