‘మోడీ’కి వెంకయ్య ఇచ్చిన కొత్త నిర్వచనం ఇదే!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ అనే ఆయన పేరుకు కొత్త అర్థం తీసుకొచ్చారు. మోడీ అంటే (ఎంఓడీఐ-మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా) అని ఆయన చెప్పారు. భారతదేశానికి మోడీ దేవుడిచ్చిన బహుమానం అని వెంకయ్య అభివర్ణించారు.
మోడీ అంటే అభివృద్ధికి మారుపేరన్న విషయాన్ని ప్రజలు గ్రహించడం ప్రారంభించారనీ, అందుకే ఆయన్ని అనుసరిస్తున్నారనీ చెప్పారు. మోడీ స్వచ్ఛ భారత్కు పిలుపు ఇస్తే అది ఒక ప్రజా ఉద్యమంగా మార్పు చెందిందని అన్నారు. మన్కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆయన చెప్పే మాటల్ని ప్రజలు ఆమోదిస్తున్నారని తెలిపారు.
ఆదివారం రాజ్పథ్లో యోగా గురువు బాబా రాందేవ్ అధ్యక్షతన జరిగిన యోగా కార్యక్రమంలో వెంకయ్య ప్రసంగించారు. తన కోసం కాకుండా ప్రజల కోసం పాటుపడుతున్న రాందేవ్ను నిజమైన రుషి, యోగపుంగవునిగా అభివర్ణించారు.
ఓం అంటే మతం మారిపోదు: రాందేవ్ బాబా
రాందేవ్ మాట్లాడుతూ.. 'ఓం'అన్నంత మాత్రాన, సూర్యనమస్కారాలు చేసినంత మాత్రాన ఎవరి మతం మారిపోదన్నారు. దుబాయ్లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఓం అని గానీ, అమీన్ అనిగానీ చెప్పవచ్చని తాను ప్రకటిస్తే ఎక్కువమంది ఓం అనడానికే మొగ్గు చూపారని గుర్తు చేశారు.
ఆయుర్వేద, యోగ పరీక్షలపై తమ సంస్థ రూ.500 కోట్లు వెచ్చించబోతోందని చెప్పారు. భారత్ అంటే ఆధ్యాత్మిక దేశమే గానీ మతపరమైన దేశం కాదని అన్నారు.