2జీ స్కాం తీర్పు: ఒక్క రోజు ముందు మోడీ, కరుణానిధి భేటీ, కేసులో కుమార్తె, దేశవ్యాప్తంగా చర్చ !
2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు తీర్పు వెలువడే ఒక్క రోజు ముందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు సీనియర్ నాయకుడు.
Recommended Video
చెన్నై: 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు తీర్పు వెలువడే ఒక్క రోజు ముందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధిని కలవడంతో తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. మంగళవారం (అక్టోబర్ 7వ తేదీ) 2జీ స్టెక్ట్రమ్ స్కాం తీర్పు వెలువడనుంది.
2జీ స్టెక్ట్రమ్ స్కాంలో కరుణానిధి కుమార్తె కనిమోళిని కూడా నిందితురాలిగా విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో కరుణానిధితో భేటీ కావాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. కరుణానిధి ఇంటిలో ప్రధాని నరేంద్ర మోడీ 15 నిమిషాలకు పైగా ఉన్నారు.
ఢిల్లీలోని ఇంటికి పిలిచిన మోడీ
కరుణానిధి చేతులు పట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆరోగ్యం గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి ఉండాలని కరుణానిధిని ప్రధాని మోడీ స్వయంగా ఆహ్వానించారు. షార్జాలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనకు వెళ్లిన కరుణానిధి కుమారుడు ఎంకే. స్టాలిన్ తమ ఇంటికి ప్రధాని మోడీ వస్తున్నారని తెలుసుకుని సోమవారం ఉదయం చెన్నై చేరుకున్నారు.
జోకులు వేసిన నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీని ఎంకే. స్టాలిన్ స్వయంగా ఇంటిలోకి తీసుకెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ కరుణానిధి కుమారుడు ఎంకే. స్టాలిన్, కుమార్తె కనిమోళినితో జోకులు వేస్తూ ఉల్లాసంగా మాట్లాడారు. 2జీ స్కాం కేసు తీర్పు వచ్చే ఒక్క రోజు ముందు ప్రధాని మోడీ కరుణానిధి కుటుంబ సభ్యులను కలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
అన్నాడీఎంకే నేతలతో !
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీలుచిక్కినప్పుడల్లా డీఎంకే పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలు చేస్తున్నారు. అన్నాడీఎంకేకి ప్రత్యర్థి అయిన డీఎంకే చీఫ్ కరుణానిధితో ఇప్పుడు ప్రధాని మోడీ భేటీ అయ్యారు.
రాజకీయాలు లేవు
ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భేటీకి రాజకీయ ప్రధాన్యం లేదని డీఎంకే వర్గాలు అంటున్నాయి. అయితే 2జీ స్కాం కేసు తీర్పు వచ్చే ఒక్క రోజు ముందు చెన్నైలోని రెండు కార్యక్రమాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ కరుణానిధి కుటుంబ సభ్యులను కలిసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మోడీ రాజకీయాలు అర్దం కావు
డీఎంకే చీఫ్ కరుణానిధి, ప్రధాని నరేంద్ర మోడీ భేటీపై అన్నాడీఎంకే పార్టీ నాయకులు మౌనంగా ఉన్నారు. ప్రధాని మోడీ అండ ఉందని ఇంతకాలం ధీమాగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ప్రధాని మోడీ రాజకీయాలు ఎవ్వరికీ అర్థం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.