దేశంలో నిరుద్యోగ సమస్య ఉందని తెలిసినా మోడీ ఒప్పుకోరు: రాహుల్ గాంధీ
హాంబర్గ్: అగ్రరాజ్యం అమెరికా, చైనా దేశాల మధ్య సమతుల్య పాత్ర పోషించడమే భారతదేశ కీలకమైన విదేశాంగ విధాన లక్ష్యాలతో ఒకటిగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో దళితులకు బీజేపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతోందన్నారు. జర్మనీలోని బుసెరియస్ సమ్మర్ స్కూలులో మాట్లాడిన ఆయన భారత్లోని సామాజిక ఆర్థిక సమస్యలపై మాట్లాడారు. విదేశీ విధానాలపై లోతుగా ఆయన మాట్లాడారు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విదేశాంగ విధానాలపై మాట్లాడి తద్వారా భవిష్యత్తులో రాజకీయపరమైన చర్చలకు మార్గం సుగుమం చేశారు రాహుల్ గాంధీ.
"అమెరికాతో భారత్కు మంచి బలమైన సంబంధాలున్నాయి. అదే సమయంలో చైనా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నిజాన్ని విస్మరించలేం. ఇందుకోసమే భారత్ రెండు దేశాల మధ్య సమతుల్యత పాటించాలి. భారత్కు కొన్ని విలువలున్నాయి. భారత్ యూరప్ దేశాలతోసమతుల్యత పాటిస్తుంది. చైనా దేశం కంటే అన్ని విషయాల్లో భారత్ అమెరికాతోనే ఎక్కువగా సఖ్యతతో ఉంటుంది. "అని రాహుల్ అన్నారు. ఇక దేశీయ సమస్యలపై కూడా రాహుల్ గాంధీ ఈ సమావేశంలో మాట్లాడారు.
"భారత దేశ అభివృద్ధిలో కొన్ని వర్గాలకు చెందిన మనుషులను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ప్రభుత్వం మద్దతుతో అన్ని వర్గాల వారు కలిసి భారత్ పరివర్తన చెందడంలో ముఖ్యపాత్ర పోషించాలని చెప్పిన కాంగ్రెస్ అధ్యక్షుడు... ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు ఈ మంత్రాన్ని పాటించాయని... ఒక్క మోడీ ప్రభుత్వమే ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల వారికి చెందాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని.. దళితులు, మైనార్టీలకు ప్రభుత్వ పథకాలు చేరకుండా చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఎన్డీఏ సర్కార్లో ఆహార హక్కు, ఉపాధి హామీలాంటివి విస్మరించారని ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రావాల్సిన నగదు నిలిపివేశారని చెప్పారు. భారత్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.. అయితే ఆ సమస్య ఉందని ప్రధానికి తెలిసినా ఒప్పుకునేందుకు వెనకాడుతారని రాహుల్ మండిపడ్డారు.