మోడీ వ్యాఖ్యల ఎఫెక్ట్, పాక్కు షాక్: స్వరం పెంచిన బెలూచిస్తాన్ నేతలు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ చేసిన బెలూచిస్తాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాని మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో బెలూచిస్తాన్ నేతలు తమ స్వరం పెంచుతున్నారు. మోడీకి కృతజ్ఞతలు చెబుతున్న బెలూచిస్తాన్ నాయకులు.. తమకు స్వాతంత్ర్యం వచ్చేలా పాక్ను ఒప్పించాలని అమెరికా, యూరప్లను కోరుతున్నారు.
బలూచిస్థాన్లో పాకిస్థాన్ మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించడాన్ని బెలూచ్ నేతలు ఆహ్వానించారు. మతపరమైన ఉగ్రవాదాన్ని ఒక విధానపర సాధనంగా పాక్ వినియోగించడం దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని, ఉగ్రవాదాన్ని నిర్మూలించలేకపోయినా సమర్థంగా దానిని ఎదుర్కోవాలని బలూచ్ జాతీయ ఉద్యమం అధ్యక్షుడు ఖలీల్ బలూచ్ మంగళవారం వాషింగ్టన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మానవత్వంపై చేస్తున్న నేరాలకు గానూ పాకిస్థాన్ను జవాబుదారీ చేయడంలో మోడీకి ఇతర దేశాలు మద్దతివ్వాలని కోరారు. గత 68 ఏళ్లుగా బలూచిస్థాన్ను ఆక్రమించుకున్న పాకిస్థాన్ అయిదు యుద్ధాల్లో అనేక నేరాలకు పాల్పడిందని ఆరోపించారు.
జాతినే తుడిచి పెట్టేయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలపై అంతర్జాతీయ సమాజం అనుసరిస్తున్న భిన్న వైఖరులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో భారత ప్రధాని మోడీ చేసిన ప్రకటన సానుకూల పరిణామం అన్నారు.
బలూచిస్థాన్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించినందుకు బలూచ్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు బ్రహందాగ్ బుగ్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వాషింగ్టన్లో వీడియో సందేశం విడుదల చేశారు. యావత్ భారత్, అక్కడి ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలూ బలూచ్ కోసం గళం వినిపించడంతో పాటు ఆ దేశం సాగిస్తున్న స్వాతంత్య్ర ఉద్యమానికి తోడ్పడాలన్నారు.
కాశ్మీర్లో పాక్ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాత్ర, ముంబై, పఠాన్కోట్ ఉగ్రవాద దాడుల్లో ప్రమేయం అందరికీ తెలిసిన సత్యాలేనన్నారు. కాశ్మీర్ విషయంలో ఒక విధంగా, బెలూచిస్థాన్కు వచ్చేసరికి మరో విధంగా పాకి మాట్లాడుతోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, బెలూచిస్తాన్ పైన ప్రధాని మోడీయే మొదటిసారి మాట్లాడలేదని, కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రస్తావించిందని ఆ పార్టీ చెప్పింది. 2005 డిసెంబర్ 27న కాంగ్రెస్ మాట్లాడిందన్నారు.