మూడు రాష్ట్రాల్లో మోడీ, తమిళనాడులో రాహుల్,ప్రచారంలో జోరు పెంచిన నేతలు
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగియడంతో నేతలు రెండో దశపై దృష్టి పెట్టారు. సుడిగాలి పర్యటనలతో ఓటర్లతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ప్రచారంలో జోరు పెంచారు. మోడీ మూడు రాష్ట్రాల్లో పర్యటించనుండగా... రాహుల్ తమిళనాడులో ప్రచారం చేయనున్నారు.
విద్యార్హతల విషయంలో మరోసారి అబద్దం, అఫిడవిట్తో అడ్డంగా బుక్కైన స్మృతి ఇరానీ
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో సుడిగాలి పర్యటనలు జరపనున్నారు. మోడీ తొలుత మహారాష్ట్రలో అహ్మద్ నగర్లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కేరళలోని కోజికోడ్లో ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి కర్నాటక వెళ్లనున్న ఆయన ఓటర్లతో మమేకం కానున్నారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సైతం ప్రచారంలో జోరు పెంచారు. రెండోదశలో ఎన్నికలు జరగనున్న ప్రాంతాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. రాహుల్ శుక్రవారం తమిళనాడులోని నాలుగు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగసభ, ర్యాలీలో పాల్గొంటారు. కృష్ణగిరి, సేలం, థేనీ, మధురైలలో ప్రచారంలో పాల్గొంటారు.