సోనియాకి వ్యతిరేకంగా సాక్ష్యాల కోసం ఇటలీ మెరైన్లకు మోడీ ఆఫర్?
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా సాక్ష్యాల కోసం మోడీ ఇటలీ మెరైన్లకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై పిఎంవో (ప్రధాని కార్యాలయం) వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కాంలో సోనియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను అందిస్తే, హత్య కేసులో నిందితులైన ఇటలీ మెరైన్ కమాండర్లను విడిచి పెడతామని ప్రధాని మోడీ డీల్కు ప్రయత్నించినట్లు కోల్కతా కేంద్రంగా నడుస్తున్న ఓ దినపత్రికలో సంచలన కథనం వచ్చింది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మెరైన్లతో డీల్, వారికిచ్చిన ఆఫర్ పైన ప్రధాని కార్యాలయం వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. ప్రధాని కార్యాలయం ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందేనని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు.

పత్రికలో వచ్చిన ఆరోపణలపై తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... 'మిస్టర్ ప్రధానమంత్రి ఇదంతా నిజమేనా?' అని తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ప్రశ్నించారు.
కాగా, సెప్టెంబరు 2015లో ఇటలీ ప్రధాని మెట్టియో రెంజీతో సమావేశమైన సందర్భంగా ప్రధాని మోడీ ఈ డీల్కు యత్నించాడని 'ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఆఫ్ ది లా ఆఫ్ దీ సీస్'కు మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్ లేఖ రాసినట్టు బెంగాల్ పత్రిక 'టెలిగ్రాఫ్' ఓ వార్తను ప్రచురించింది. కాగా, ఈ ఆరోపణలను విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఇటలీ స్పందించవలసి ఉంది.
ఫిబ్రవరి 15, 2012న ఇద్దరు భారత మత్స్యకారులను ఇటలీ నావికా దళానికి చెందిన సైనికులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటలీ మెరైన్లు భారత్లో విచారణను ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications