బస్సులో రేప్ యత్నం: దూకేసిన తల్లీకూతుళ్లు, కూతురు మృతి
మొగ: పంజాబ్ రాష్ట్రంలో దారుణమైన, అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది. పంజాబ్లోని మొగ జిల్లాలో ఓ బస్సు కండక్టర్ సహాయకుడు బస్సు ఎక్కిన తల్లీకూతుళ్లపై లైంగిక దాడికి దిగాడు. దీంతో వారిద్దరు బస్సులోంచి దూకేశారు. ఈ ఘటనలో 13 ఏళ్ల కూతురు మరణించగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం - ఆ బస్సు ఆర్బిట్ ఏవియేషన్కు చెందింది. దాని యజమాని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్. అయితే, ఆ బస్సును వేరే కంపెనీకి లీజ్కు ఇచ్చినట్లు సమాచారం. అందుకు సంబంధించిన పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
రైతు భార్య అయిన 35 ఏళ్ల మహిళ, తన కూతురు, 14 ఏళ్ల కుమారుడితో కలిసి పక్క గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మొగ సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న టోల్ ప్లాజాకు బస్సు చేరుకున్న సమయంలో అసిస్టెంట్ బస్సు కండక్టర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆ సమయంలో బస్సులో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
మహిళ కండక్టర్కు అతనిపై ఫిర్యాదు చేసింది. అయితే, అతను తన అసిస్టెంట్నే వెనుకేసుకొచ్చాడు. మహిళ డ్రైవర్ వద్దకు వెళ్లి బస్సు ఆపాలని అడిగింది. బస్సును ఆపితే తన ఇద్దరు పిల్లలతో పాటు దిగిపోతానని చెప్పింది. అతనూ ఆమె మాట వినలేదు.
దాంతో ఆమె తన కూతురితో పాటు బస్సులోంచి కిందికి దూకేసింది. ఇరువురు కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. కుమారుడు మాత్రమే బస్సులోనే ఉన్నాడు. వారు దూకేయగానే బస్సును వదిలేసి డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ కండక్టర్ పారిపోయారు.
అటుగా వెళ్తున్నవారు వారిద్దరినీ ఆస్పత్రికి చేర్చారు. చికిత్స పొందుతూ కూతురు మరణించింది. సాయంత్రానికి మహిళ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు. మహిళ ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు.
బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదని పోలీసులు అంటున్నారు.