ప్రియుడితో కూతురు పెళ్లి: ఒంటికి నిప్పంటించుకున్న తల్లి
తిరువనంతపురం: తను ప్రేమించిన వ్యక్తితో వివాహం చేయడం లేదనే కోపంతో ఓ యువతి ఇంటిని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. తను చూసిన పెళ్లి కొడుకును కాదని, మరో వ్యక్తితో పెళ్లి చేసుకుంటుందన్న విషయం తెలిసిన ఆ యువతి తల్లి తీవ్ర అవమాన భారానికి లోనైంది. ఈ క్రమంలో కూతురు చేసిన పనికి తన ప్రాణాలను తీసుకునేందుకు యత్నించి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది ఆ తల్లి. ఈ విషాద ఘటన కేరళలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని పూన్కుళంలో నివసిస్తున్న సునీతకు కార్తీక అనే కూతురు ఉంది. ఆమె వయసు 19సంవత్సరాలు. ఈ మధ్యనే సునీత కార్తీకకు ఓ ఆర్మీ సంబంధం తీసుకొచ్చింది. అయితే అప్పటికే కార్తీక వేరెవరినో ప్రేమిస్తోంది.
ఆ విషయాన్ని తల్లితో చెప్పినా ఆమె వినిపించుకోలేదు. దీంతో కార్తీక ఆ సంబంధం చూసుకోవడానికొచ్చిన పెళ్లికొడుకుతో తన ప్రేమ విషయం చెప్పింది. అతను సంబంధాన్ని కాదనుకుని వెళ్లిపోయాడు. దీంతో సునీత తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురు తన మాట వినడం లేదని ఎంతగానో కుమిలిపోయింది.

ఈ తరుణంలో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయాన్ని కార్తీక ప్రియుడితో చెప్పింది. వారిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రేమికులు పారిపోతున్న సమయంలో యువకుడి తల్లిదండ్రులు వారిని పట్టుకున్నారు. దీంతో ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించారు. ఇరు కుటుంబాల సభ్యుల పెళ్లికి హాజరయ్యారు. కానీ, సునీత మాత్రం పెళ్లికి హాజరుకాలేదు. తన మాట వినకుండా వెళ్లిపోయిందనే మనస్తాపంతో పెళ్లి సమయానికి సునీత తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పెళ్లి జరిగిన తర్వాత ఇంటికొచ్చిన కార్తీక తల్లిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది.
అప్పటికే దాదాపు ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. వెంటనే సునీతను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రేమించిన వ్యక్తిని దక్కించుకున్న ఆ కూతురు.. కని, పెంచిన తల్లిని మాత్రం దూరం చేసుకున్నట్లయింది.












Click it and Unblock the Notifications