జులై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల భేటీ -కొవిడ్ ప్రోటోకాల్స్ నడుమ ఆగస్టు 13 వరకు -మోదీపై విపక్షాల కత్తులు
దేశంలో కరోనా మహమ్మారి విలయాన్ని నియంత్రించడంలో, ప్రజలకు సకాలంలో వ్యాక్సిన్లు అందించడంలో మోదీ సర్కారు విఫలమైందన్న విమర్శల నడుమ సభా సమరానికి ముహుర్తం దాదాపు ఖరారైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ప్రతి ఏటా జులై మూడో వారంలో వర్షాకాల భేటీ మొదలుకావడం ఆనవాయితీగా వస్తున్నా, గతేడాది లాక్ డౌన్ కారణంగా ఆ సెషన్ ను సెప్టెంబర్ లో నిర్వహించడం తెలిసిందే.
2021 ఏడాదికిగానూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూన్ 19న ప్రారంభమై, స్వాతంత్ర్య దినోత్సవానికి రెండ్రోజుల ముందు, అంటే, ఆగస్టు 13న ముగుస్తాయని, దాదాపు నెల రోజులు సాగే సమావేశాల్లో మొత్తం 20 సిట్టింగ్స్ జరిగే వీలుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) భేటీ తర్వాతే పార్లమెంట్ భేటీకి సంబంధించిన తేదీల అధికారిక ప్రకటన వెలువడనుంది.

కరోనా కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, సిబ్బంది కొవిడ్ కాటుకు గురికావడం, కొందరు మంత్రులు, ఎంపీలు, సిబ్బంది ప్రాణాలు కూడా కోల్పోయిన దరిమిలా, ఈసారి జరిగే వర్షాకాలా సమావేశాల కోసం కొవిడ్ ప్రోటోకాల్స్ ను సవరించారు. పార్లమెంట్ ఆవరణలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొందినవారై ఉండాలనే నిబంధన పెట్టారు. ఇప్పటికే దాదాపు అందరు ఎంపీలు, పార్లమెంట్ సిబ్బంది కనీసం ఒక డోసు టీకాలు పొంది ఉండటం గమనార్హం. ఇదిలాఉంటే..
గడిచిన ఏడాదిన్నరలాగే రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సైతం కొవిడ్ సంబంధిత అంశాలకే ప్రాధాన్యం లభించనుంది. కరోనా నియంత్రణ, వ్యాక్సిన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. వ్యాక్సిన్ల కొరతతోపాటు నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, రైతుల ఉద్యమంపైనా మోదీ సర్కారును నిలదీయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు రెడీ అవుతున్నాయి. వారికి ధీటుగా బదులిచ్చేందుకు అధికారపక్షం అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది..












Click it and Unblock the Notifications