వెదర్ అప్డేట్: గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గుజరాత్, విదర్భ, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, తెలంగాణ ప్రాంతాల్లో సోమవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Recommended Video
కర్ణాటక దక్షిణ కోస్తా, సౌరాష్ట్ర, మధ్య మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతం, జమ్మూకాశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో, ఉత్తర కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, తూర్పు రాజస్థాన్, హర్యానా, ఛండీగఢ్, మరఠ్వాడ, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఒడిశా కోస్తా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాబోయే 48గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం
బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో జులై 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. జులై 14న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
సోమవారం పలుచోట్ల అతిభారీ, మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కాగా, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సగటు వర్షపాతం బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 6 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి.