రుతుపవనాల కాలం: ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు, ఈదురుగాలులు
హైదరాబాద్/అమరావతి: నైరుతి రుతుపవనాలు మరో వారంలో కేరళలో ప్రవేశించనున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 22 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి.
జూన్ 5-10లోపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు
మే 27 వరకు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి ముందుగానే రుతుపవనాలు వస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. జూన్ 5 నుంచి 10 వరకు లోపు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీల అసని తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏపీలో అత్యధికంగా వర్షాలు నమోదయ్యాయి.
తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములుమెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో ఏదో ఒక చోట వర్షం కురుస్తూనే ఉంది.
ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు
ఏపీ విషయానికొస్తే.. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజలపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లలు పడే అవకాశం ఉందని పేర్కొంది.