జయ మృతి చెందిన నెల రోజుల తర్వాత..: హిస్టారికల్
జయలలిత మృతి చెంది నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో తమిళనాడులో రాజకీయంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.
చెన్నై: జయలలిత మృతి చెంది నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో తమిళనాడులో రాజకీయంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా అన్నాడీఎంకేలో పదవి కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకున్నారు.
చివరకు అన్నాడీఎంకే చీఫ్ పదవి ముందు నుంచీ రేసులో ఉన్న శశికళ దక్కించుకున్నారు. అయినా ఇంకా అమ్మ వారసత్వం పైన పోరు ఆగడం లేదు. జయలలిత కోడలు దీపా జయకుమార్ ఎప్పటికి అప్పుడు తాను రంగంలోకి దిగుతానని శశికళను హెచ్చరిస్తున్నారు.
సైక్లోనా వార్దా
జయలలిత మృతి తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఎదుర్కొన్న తొలి పెద్ద సవాల్ సైక్లోన్ వార్ధా. అప్పటికే పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2015లో వచ్చిన వరదల అనుభవంతో అధికారులు చురుగ్గా వ్యవహరించారు. స్వయంగా పన్నీరు సెల్వం సహాయక కేంద్రాలకు వెళ్లారు. మంత్రులను కూడా అలాగే ఆదేశించారు.
పన్నీరు సెల్వంను కలిసిన స్టాలిన్
కరువు సమస్య పైన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను కలిశారు. చాలా ఏళ్ల తర్వాత ఓ ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిని సమస్యల గురించి కలిసి చర్చించారని అంటున్నారు. జనవరి 4వ తేదీన వీరు కలిశారు. ఇది హిస్టారిక్ అంటున్నారు.
దశాబ్దాల తర్వాత పార్టీలో రెండు పవర్ కేంద్రాలు
దశాబ్దాల తర్వాత, ఇప్పుడు జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకేలో రెండు పవర్ కేంద్రాలు కనిపిస్తున్నాయి. జయ ఉన్నప్పుడు ఆమెనే ముఖ్యమంత్రి, ఆమెనే పార్టీ అధినేత్రి. ఇప్పుడు పార్టీ అధినేత్రి శశికళ. సీఎం పన్నీరు సెల్వం. సీఎం పదవి కోసం శశికళ పావులు కదుపుతుండటంతో పన్నీరు సెల్వం తనదైన ఎత్తులు వేస్తున్నారు. ఇరువురు పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
శశికళకు చిక్కులే
జయలలిత స్థానంలో శశికళ పార్టీ అధినేత్రి అయ్యారు. అయితే ఆమెకు ఇటు పార్టీ ముఖ్య నేతల నుంచి పవర్ పోరు ఉంది. మరోవైపు కార్యకర్తల్లోను నిరసన కనిపిస్తోంది. స్వయంగా జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో ఎక్కువ మంది శశికళను ఆమోదించడం లేదు.