వేధింపులు..: రాహుల్పై కాంగ్రెస్ నేత జయంతి సంచలనం, గుడ్బై?
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి జయంతి నటరాజన్ సొంత పార్టీ పైన, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2013లో తనను బలవంతంగా కేంద్రమంత్రి పదవి నుండి తప్పించారని ఆరోపించారు.
వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం తనను వేధించిందన్నారు. రాహుల్ గాంధీ కార్యాలయంలోనే తన పైన కుట్రకు పథకం సిద్ధమైందని ఆమె ఘాటైన ఆరోపణలు చేశారు. తాను రాహుల్ గాంధీని ఎంతో గౌరవించినప్పటికీ తన పైన కుట్ర జరిగిందని ఆరోపించారు.
గత నవంబరులోనే ఈ లేఖ రాశారు..
జయంతి నటరాజన్ గత ఏడాది నవంబర్ నెలలో రాసిన లేఖ ఇప్పుడు లీకు అయింది. ఆమె అప్పుడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాజాగా అది మీడియాకు లీకైంది.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై?
కాంగ్రెస్ పైన, రాహుల్ గాంధీ పైన జయంతి నటరాజన్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఆ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమె శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు.