20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దం, సంకీర్ణ ప్రభుత్వానికి మాజీ సీఎం షాక్!
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప శుక్రవారం బాంబు వేశారు. త్వరలో మీ ప్రభుత్వంలోని 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పులు జరుగుతాయని, ఏక్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా, కూలిపోతుందా అనే విషయం తనకు తెలీదని యడ్యూరప్ప అన్నారు.
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం తీరు మీద 20 మంది ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని బీఎస్ యడ్యూరప్ప అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం తీరు మీద అసహనంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదని, అది వేచి చూడాలని మాజీ సీఎం యడ్యూరప్ప చెప్పారు.
కర్ణాటకలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని బీఎస్ యడ్యూరప్ప అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత ఇక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భారీ మార్పులు వస్తాయని గతంలో బీఎస్. యడ్యూరప్ప అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ఉన్నారు. మాజీ సీఎం సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నినాదం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల తరువాత కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత మంది రాజీనామా చేస్తారో వేచిచూడాలి.