15 రోజుల శిశువును ఫ్రిడ్జ్లో పెట్టిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?
ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రసవానంతరం తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక తల్లి.. తన నవజాత శిశువును ఫ్రీజర్లో పెట్టి మర్చిపోయింది. దీంతో ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఘటన ఎలా జరిగింది?
వివరాల ప్రకారం.. గత శుక్రవారం రాత్రి సదరు మహిళ తన బిడ్డను నిద్రపుచ్చిన తర్వాత పొరపాటున ఫ్రీజర్లో ఉంచింది. కొంతసేపటికి చిన్నారి ఏడుపు వినిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇల్లంతా వెతికిన తర్వాత, చివరికి రిఫ్రిజిరేటర్లో అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను కనుగొన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని స్పష్టం చేశారు.

పోస్ట్పార్టమ్ డిప్రెషన్..
పోలీసుల దర్యాప్తులో.. సదరు మహిళ ప్రసవానంతరం మానసిక సమస్యలు (Postpartum Depression)తో బాధపడుతున్నట్లు తేలింది. ఈ సమస్య కారణంగానే ఆమె నిర్ణయాలు తీసుకోలేకపోయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెను కూడా ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చినట్టు వెల్లడించారు.
కాగా ప్రసవానంతరం చాలా మంది మహిళలు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. వీటిని 'బేబీ బ్లూస్' లేదా 'పోస్ట్పార్టమ్ డిప్రెషన్' అని పిలుస్తారు. ఈ సమయంలో దిగులు, భయం, చిరాకు, నిద్రలేమి, విచారం ఎక్కువగా ఉంటాయి. కొందరు అకారణంగా ఏడవడం, భయపడడం, అలసిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. బిడ్డను చూసుకోలేమన్న అనుమానం తల్లిలో కలుగుతుంది. తీవ్రమైతే తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని నిపుణుల హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రసవం తర్వాత మహిళలలో 70% వరకు తాత్కాలిక మానసిక ఒత్తిడి కనిపించడం సహజం అని చెబుతున్నారు. సాధారణంగా నాలుగు నుంచి ఐదు రోజుల్లో తగ్గిపోతుందని.. అయితే దీర్ఘకాలం కొనసాగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రసవానంతర మానసిక ఆరోగ్యంపై కూడా మహిళలు ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications