నాన్న చనిపోయాక మదర్ ఓదార్చారు - తనతో పనిచేయమని అడిగారు - థెరిసా జయంతిన ప్రియాంక గాంధీ
''నాన్న(రాజీవ్ గాంధీ) చనిపోయిన కొద్ది రోజులకే పరామర్శ కోసం మదర్ థెరిసా మా ఇంటికొచ్చారు. ఆ సమయంలో నేను జ్వరంతో బాధపడుతూ మంచానపడ్డాను. మదర్ నా దగ్గరికొచ్చి ఓదార్చారు. చేయి పట్టుకుని.. 'రా.. మాతో కలిసి మిషనరీస్ ఆప్ ఛారిటీలో పనిచేద్దువుగానీ' అని అడిగారు. ఆమె ఆదరణ, కరుణను ఎప్పటికీ మర్చిపోలేం'' అంటూ సెయింట్ తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా.
గుడ్న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి అడుగు - ఎస్పీ చరణ్ తాజా వీడియో
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న' అనే నినాదాన్నే జీవిత మార్గంగా మలుచుకుని, తన సేవా గుణంతో విశ్వమాతగా ఎదిగిన మదర్ థెరిసా 110వ జయంతి సందర్భంగా బుధవారం(ఆగస్టు 26) భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఆమెను స్మరించుకున్నాయి. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి, చిన్నవయసులోనే మిషనరీగా మారి, భారత్కు వచ్చి కోల్కతా మురికివాడలో అనాధ శరణాలయాన్ని స్థాపించి, లక్షలాది మందిని చేరదీసి అమ్మగా మారిన ఆమె జీవిత చరిత్రను జనం మననం చేసుకున్నారు.
మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఆమె జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ప్రియాంక గాంధీ ఇంకొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మదర్ కోరినట్లుగానే తర్వాతి కాలంలో పలుమార్లు మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానంటూ ఆ ఫొటోలను సైతం ప్రియాంక పోస్ట్ చేశారు. ''మదర్ లాగే, నిస్వార్థ సేవ, ప్రేమ మార్గాన్ని నాకు చూపుతోన్న మిషనరీ ఆఫ్ ఛారిటీ సిస్టర్లకు కృతజ్ఞతలు''అని ప్రియాంక పేర్కొన్నారు.
1910, ఆగస్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ ధెరిసా, 12 ఏళ్ల వయస్సులోనే నన్ గా మారి, తన 18వ ఏట టీచర్ గా కోల్కతాకు వచ్చారు. అక్కడి మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి ఉద్యోగానికి రాజీనామా చేసి మానవ సేవకు అంకితమైపోయారు. 1951లో ఆమెకు భారత పౌరసత్వం లభించింది. 1980లో భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' పొందారు. 87ఏళ్ల వయసులో 1997, సెప్టెంబర్ 5న కన్నుమూశారు. 2016, సెప్టెంబర్ 4న పోప్ ఫాన్సిస్ మదర్ థెరిసాను సెయిట్ గా ప్రకటించారు. కాగా, మదర్ థెరిసా మత మార్పిడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వస్తోన్న బీజేపీ శ్రేణులు ఆమె జయంతి సందర్భంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశమైంది.