ఉబర్, ఓలా నిలువు దోపిడి: చెక్ పెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విచ్చలవిడిగా దోపిడీలు చేస్తున్న ప్రయివేటు క్యాబ్ లకు ఇక ముందు చెక్ పడనుంది. ట్యాక్సీ అగ్రిగేటర్లు ఓలా, ఉబర్ లను మోటార్స్ వెహికల్స్ యాక్ట్ ఫరిదిలోకి తీసుకురావడానికి రూపొందించిన డ్రాఫ్ట్ చట్టానికి కేంద్ర క్యాబినేట్ ఆమోద ముద్ర వేసింది.
కేంద్ర క్యాబినేట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డ్రాఫ్ట్ నియమాల ప్రకారం లైసెన్సింగ్ నిబంధనలు అతిక్రమించిన వారికి రూ. ఒక లక్ష వరకు జరిమానా విధించనున్నారు. దేశమంతటా ఒకే విధమైన డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తున్నది.
మైనర్లు (జువనైల్స్) ఎవరైనా ఈ తప్పిదాలకు పాల్పడితే కారు యజమానులు లేదా మైనర్ల గార్డియన్స్ కు ఈ నేరాలు వర్థించేలా డ్రాఫ్ట్ ను ప్రభుత్వం రూపొందించింది. ఈ నేరాలకు రూ. 25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఈ నేరాలను జువనైల్స్ జస్టిస్ యాక్ట్ కిందకు తీసుకొచ్చి వారి వాహన రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం రద్దు చేయనుంది. మోటార్ వెహికల్స్ సవరణ బిల్లును కేంద్ర క్యాబినేట్ ఆమోదించింది. హిట్ అండ్ రన్ కేసులో మరణించిన వారికి రూ. 10 లక్షల వరకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు.మొత్తం మీద ప్రయివేటు క్యాబ్ ల దోపిడీకి కళ్లెంపడనుంది.