కట్నం కోసం హంగామా: పెళ్లి రద్దు చేసిన వధువు
భోపాల్: అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు, అతని కుటుంబసభ్యులు చేసిన హంగామాని సహించలేక పోయింది ఆ నవ వధువు. అందుకే.. ఏకంగా తెల్లారి జరగబోయే పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మోహగాన్ పట్టణానికి చెందిన మాల్కాన్ సింగ్ తన కుమార్తె మీనాక్షికి మనీష్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లనగా.. పెళ్లికొడుకు తల్లిదండ్రులు మద్యం తాగి అదనంగా మరో రూ.రెండులక్షల కట్నం ఇవ్వాలంటూ అడగటం మొదలుపెట్టారు.
అంతేగాకుండా వధువు తల్లిదండ్రులపై చెయ్యి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తనకు ఈ పెళ్లి వద్దంటూ తేల్చిచెప్పింది. అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్స్టేషన్లో వరుడి కుటుంసభ్యులపై ఫిర్యాదు చేసింది.
వరుడి కుటుంబసభ్యులు అడిగిన కట్నం ఇచ్చేందుకు తమ తల్లిదండ్రులు అంగీకరించారని, అయినా అదనపు కట్నం కోసం వరుడు, అతని కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేశారని నవ వధువు ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ విమల్ కుమార్ జైన్ తెలిపారు. ఆ వధువు ధైర్యంగా పెళ్లి రద్దు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. వరుడి కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.