కరోనా విరుగుడు ఇదే..?: యోగా, శ్లోకం, భజన, పాటలు.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, మత పెద్దలతో భేటీ..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. వైరస్ను పురాతన భారతీయ సాంప్రదాయ ప్రకారం తరిమికొట్టొచ్చని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రజలకు మూలికాలను అందజేస్తామని ప్రకటించింది. జీవన్ అమృత్ యోజన కింద 50 గ్రాముల మూలికాలను కూడా అందజేశారు. ఆ మరునాడే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
యోగా, శ్లోకం..
కరోనా వైరస్ సోకిన వారు యోగా చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. దీంతోపాటు శ్లోకాలు పఠించి, భజన చేయాలని కోరారు. దీంతో వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. పురాతన భారతీయ సాంప్రదాయం ప్రకారం సంగీతంతో వైరస్ను తరిమికొట్టొచ్చని తెలిపారు. ఇదివరకు చాలా రోగాలు ప్రేమతో నయమయ్యేవని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
మత పెద్దలతో చర్చ
కరోనా వల్ల తన కుమారుడిని తల్లి ప్రేమతో తాకే వీలులేదని శివరాజ్ గుర్తుచేశారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తూనే.. భారతీయ సాంప్రదాయంలోని మౌలిక పద్దతులను ప్రయత్నించాలని కోరారు. ఆయన మత పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత సూచన చేశారని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్' రిపోర్ట్ చేసింది.
పాటలు, భజన
ప్రత్యామ్నాయ చికిత్సలపై మత పెద్దలను సీఎం అభిప్రాయం కోరారు. మరణాల సంఖ్య తగ్గేందుకు దోహదపడుతోందని శివరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. పాటలు పాడి, భజన చేసి, శ్లోకాలు చదవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. శివరాజ్ సలహాను కొందరు స్వాగతిస్తున్నారు.
యడియూరప్ప కూడా..
ఇటీవల కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గిరిధర కాజేనే కలిశారు. కరోనా వైరస్ నివారణ కోసం పురాతన భారతీయ మందులతో ప్రయోగం చేసే అంశంపై చర్చించారు. ఇప్పటికే 10 మంది రోగులకు మందులను అందించాలని భావిస్తున్నామని కాజే తెలిపారు. వారిపై మందుల ప్రభావాన్ని బట్టి తదుపరి ఔషధం గురించి చర్చిస్తామని పేర్కొన్నారు. మరోవైపు గుజరాత్ కూడా 75 మంది రోగులు ఆయుర్వేద ఔషధాలను అందించాలని నిర్ణయం తీసుకున్నది.