మధ్య ప్రదేశ్ గవర్నర్ కుమారుడు అనుమానాస్పద మృతి, పలు అనుమానాలు
లక్నో: మధ్య ప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్ కుమారుడు శైలేశ్ యాదవ్ బుధవారం అనుమానాస్పద రీతిలో బుధవారం ఉదయం మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని తమ ఇంటిలోని అతని గదిలో నేలపై పడి ఉన్నాడని, మెదడులో రక్తస్రావంతో చనిపోయిన ఉంటాడని జాతీయ మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి.
కొడుకు మరణవార్త వినగానే రాం నరేశ్ షాక్కు గురయ్యారు. దీంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మధ్య ప్రదేశ్లో బయటపడిన పబ్లిక్ ఎగ్జామినేషన్ కుంభకోణంలో శైలేశ్ యాదవ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శైలేశ్ యాదవ్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.

2013లో సంచలనం సృష్టించిన ఎంపీపీఈబీ (మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు) కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు ప్రభుత్వ ఉద్యోగాలను తమ వారికి కట్టబెట్టేందుకు ముందే ప్రశ్నాపత్రాలు లీక్ చేయించడం దగ్గర్నుంచి, ఇంటర్యూల వరకూ అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది.
మరోవైపు ఈ స్కాంలో ప్రమేయం ఉందంటూ గవర్నర్పై కూడా ఆరోపణలు రావడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం దర్యాప్తు చేసింది. అవి నిజమని తేలడంతో గవర్నర్పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో రాం నరేశ్ యాదవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
ఎవరు ఒత్తిడి చేసినా పదవికి రాజీనామా చేయనని గవర్నర్ రాం నరేశ్ యాదవ్ ఆ సమయంలో తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications