రాందేవ్ బాబా పుత్రజీవక్ బీజ్పై మధ్య ప్రదేశ్లో నిషేధం, పేరు మార్చండి
భోపాల్: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఆయుర్వేద ఫార్మసీ ఉత్పత్తి చేస్తోన్న 'పుత్రజీవక్ బీజ్' మెడిసిన్ను మంగళవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఆ మెడిసిన్ పేరు మార్చేంతవరకు అమ్మకాలు జరపరాదని రాందేవ్ బాబాకు చెందిన పతంజలి యోగాపీఠానికి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మెడిసిన్ వాడితే మగబిడ్డ పుట్టడం ఖాయమని ప్రచారం చేస్తున్నారంటూ దివ్యా ఆయుర్వేద ఫార్మసీపై రాజ్యసభలో జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఎంపీ కేసీ త్యాగి సభలోకి 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్ ప్యాకెట్ను తీసుకొచ్చి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై రాందేవ్ బాబా మెడిసిన్కు 'పుత్రజీవక్' అనే పేరు ఎలా వచ్చిందో వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు పుత్రజీవక్ తింటే మగబిడ్డే పుడతాడని తాను ఎప్పుడూ చెప్పలేదని కూడా స్పష్టం చేశారు. తనపై అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
దివ్యా ఫార్మసీ సంస్ధ ఉత్పత్తి చేస్తున్న పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆ పేరుకు మగబిడ్డ పుట్టడానికి సంబంధమే లేదని చెప్పారు. తనపై రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకే కొందరు నేతలు ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుత్ర జీవక్ మందు తింటే మగ బిడ్డనే జన్మిస్తాడని నేనెప్పుడూ ఎక్కడా చెప్పలేదని అన్నారు.
'పుత్రంజివా రాక్సోబుర్గి'కి చెందిన వృక్షజాతి పేరే పుత్రజీవక్. గుజరాతీ, హిందీ, కన్నడలో పుత్రజీవక్ అని పిలుస్తారని తెలిపారు. మెడిసిన్ పేరు మార్చేందుకు తాము సిద్ధంగా లేమని కూడా స్పష్టం చేశారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. విపక్షాలు మాత్రం ఆ మెడిసిన్ను నిషేధించాల్సిందేనని, తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.