ఎంత లిక్కర్ తాగినా కిక్కు ఎక్కడం లేదు: హోంమంత్రికి మందుబాబు ఫిర్యాదు, కదిలిన యంత్రాంగం
భోపాల్: ఎంత తాగినా తనకు కిక్కు ఎక్కడం లేదంటూ ఓ మందు బాబు ఏకంగా రాష్ట్ర హోంమంత్రికే ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసిన మద్యంలో కల్తీ జరిగిందని, దీంతో తాను రెండు మూడు బాటిళ్లు తాగినా తనకు కిక్కు ఎక్కడం లేదని వాపోయాడు. కల్తీ మద్యం అమ్ముతున్న దుకాణంపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రితోపాటు అబ్కారీ శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో చోటు చేసుకుంది. హోంమంత్రి, అబ్కారీ శాఖ కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు
రెండు బాటిళ్లు తాగినా ఎక్కని కిక్కు..
వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిన్లోని బహదుర్ గంజ్కు చెందిన లోకేశ్ సోథియా ఏప్రిల్ 12న నగరంలోని ఓ మద్యం దుకాణంలో నాలుగు క్వార్టర్ బాటిళ్లు కొనుగోలు చేశాడు. స్నేహితుడితో కలిసి రెండు సీసాలు ఖాళీ చేశాడు. బాటిల్ మూత తీసినప్పుడు మద్యం వాసన రాకపోవటం, రెండు సీసాలు ఖాళీ తాగినా కిక్కు ఎక్కకపోవటంతో కల్తీ జరిగినట్లు భావించాడు. వెంటనే హోంమంత్రి, అబ్కారీ శాఖలకు ఫిర్యాదు చేశాడు.
లిక్కర్నూ కల్తీ చేస్తారా?: మందుబాబు ఆవేదన
అంతేగాక, 'మరో రెండు బాటిళ్లను సీల్ తీయకుండా నా వద్దే ఉంచుకున్నా. అవసరమైనప్పుడు ఆధారాలుగా వాటిని అందిస్తాను. ఆహారం, నూనెలు, ఇతర వస్తువుల్లో కల్తీ జరుగుతోందని వార్తలు వింటున్నాం. ఇప్పుడు లిక్కర్లోనూ చేస్తున్నారు. అది చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వినియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదు చేస్తాను. నేను ఇరవై ఏళ్లుగా మద్యం తాగుతున్నా.. దాని స్వచ్ఛత, రుచి నాకు తెలుసు.' అని చెప్పుకొచ్చాడు మందుబాబు సోథియా.
లిక్కర్ కల్తీపై హోంమంత్రి, ఎక్సైజ్ శాఖకు మందుబాబు ఫిర్యాదు
మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, ఉజ్జయిన్ అబ్కారీ శాఖ కమిషనర్ ఇందెర్ సింగ్ దమోర్కు.. లిక్కర్ కల్తీపై ఫిర్యాదు చేశానని సోథియా తెలిపాడు. కాగా, వినియోగదారుల ఫోరమ్లో చీటింగ్ కేసు నమోదు చేస్తామని సోథియా న్యాయవాది నరేంద్ర సింగ్ ధక్డే తెలిపారు. ' నా క్లయింట్ పెయిడ్ పార్కింగ్ నడుపుతున్నారు. చాలా ఏళ్లుగా మద్యం సేవిస్తున్నారు. ఆయనకు ఏది నకిలీ, ఏది నిజమైనది అనే తేడా తెలుసు' అని సోథియా తరపు న్యాయవాది తెలిపారు. కాగా, ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.