ఆర్ధిక సంక్షోభం: కుటుంబాన్ని, కుక్కలను చంపి ఆపై ఆత్మహత్య
భోపాల్: ఆర్థిక సంక్షోభం కారణంగా మనస్థాపం చెందిన ఓ వ్యక్తి భార్య, పిల్లలతో సహా రెండు పెంపుడు కుక్కలను తుపాకీతో కాల్చి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని కాట్ని జిల్లా బహోరీబండ్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం... బీజేపీ సభ్యుడైన శశాంక్ తివారీ (45) ఓ పెట్రోల్ బంకుకు యజమానిగా ఉన్నారు. తివారీ ఇచ్చిన రెండు చెక్కులు ఇండోర్, భోపాల్ నగరాల్లోని బ్యాంకుల్లో వేయగా అవి బౌన్స్ అయినట్లు తెలిసింది. దీంతో తివారీ మానసికంగా కుంగిపోయాడు.
దాంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురై దిక్కుతోచని స్థితిలో తన భార్య మిని తివారీ(40), కుమారుడు అభి (8), కుమార్తె మణి (11)లను తుపాకీతో కాల్చిచంపాడు. తాను పెంచుకుంటున్న రెండు కుక్కలను కూడా కాల్చేశాడు. అనంతరం అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ గౌరవ్ రాజ్పుత్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ గౌరవ్ తెలిపారు. శశాంక్ తివారీ మరణ వార్త తెలిసిన పలువురు బీజేపీ నేతలు ఘటనా స్థలానికి వచ్చారు.