రెచ్చగొట్టొద్దు: టి ఎంపీలకు సోనియా, వెంకయ్య ఒక్కడే
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతం వారిని రెచ్చగొట్టవద్దని, ఇరు ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసుండాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులకు హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటైందని ఆనందోత్సాహాలలో మునిగి తేలకుండా పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని సూచించారు. గురువారం బిల్లు రాజ్యసభలో పాసైన అనంతరం పలువురు టి నేతలు ఆమెను కలిశారు.
ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, బలరాం నాయక్, రాజయ్య, సురేష్ షెట్కర్, నంది ఎల్లయ్య, అంజన్ కుమార్ యాదవ్లు ఆమెను కలిశారు. తెలంగాణ ప్రాంత నేతలు ఆమెకు మెమొంటో ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఆమెకు వారు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే తాను వస్తానని, ఎన్నికల ప్రచార తేదీలు ఖరారు కానున్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికలకు ముందే: డిఎస్
సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర విలీనంపై అధిష్టానం చర్చిస్తుందన్నారు.
అధికారంలోకి వచ్చాక తాము ఇస్తామని తెలిసే ఎన్నికలముందు కాంగ్రెసు పార్టీ తెలంగాణ వైపు మొగ్గు చూపిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తాము మద్దతిచ్చామన్నారు. హైదరాబాదును తెలంగాణ ప్రాంతానికే ఇవ్వాలని తామే చెప్పామన్నారు. సీమాంధ్రల సమస్యలు తమ బాధ్యత అని, వారికి అండగా నిలబడతామని చెప్పారు.
నాటకం: హరికృష్ణ
విభజన ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల రాజీనామాలు నాటకమేనని టిడిపి సీనియర్ నేత నందమూరి హరికృష్ణ అన్నారు. ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయకోణంలో రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఒకే ఒక్కడు వెంకయ్య!
రాజ్యసభలో వెంకయ్యనాయుడు విజృంభించారు. సవ'రణ'రంగంలో చెలరేగిపోయారు. ప్రభుత్వ పెద్దలను పరుగులు పెట్టించారు. సీమాంధ్రకు గట్టి హామీలు సాధించిగాని.. వదిలిపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు పోరాట పటిమను కనబర్చారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, అయితే సీమాంధ్రకు మాత్రం న్యాయం జరగాలని ఆయన పదేపదే పట్టుబట్టారు.
చాలా సవరణలు ప్రతిపాదించిన ఆయన అన్నింటిపైనా ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీని పొంది ఆ తర్వాత వాటిని విరమించుకున్నారు. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించకుంటే తాను డివిజన్కు పట్టుబట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే, జీఓఎం సభ్యుడు జైరామ్ రమేశ్లను ముప్పుతిప్పలు పెట్టారు. జైరామ్ రమేశ్ అయితే పదేపదే తన స్థానం నుంచి వెంకయ్య వద్దకు, బిజెపి నాయకుల వద్దకు అలుపు లేకుండా తిరిగారు.
ఒకానొక దశలో అయితే ఆయన చాలా అసహనంగా కనిపించారు. వెంకయ్య మాత్రం పట్టువదల్లేదు. తమ రాష్ట్రం విడిపోతోందని, సీమాంధ్రకు న్యాయం జరగాల్సి ఉందని కాబట్టి గొడవ చేయొద్దని ఒక సందర్భంలో ఆయన టిఎంసి సభ్యులకు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు.
కాగా, బిజెపి విశ్వసనీయత గల పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం ఉదయం అన్నారు. బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కమిటీలతో ఇన్నాళ్లు కాంగ్రెసు పార్టీ కాలయాపన చేయకుంటే వెయ్యిమంది విద్యార్థులు చనిపోయే వారు కాదన్నారు.