లైంగిక వేధింపులు: హైకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు నోటీసు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్కె గంగేలే అభిశంసనకు 58 మంది రాజ్యసభ సభ్యులు నోటీసు ఇచ్చారు. గ్వాలియర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ మహిళా న్యాయమూర్తిని గంగేలే లైగికంగా వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, బిఎస్పి వంటి వివిధ పార్టీల సభ్యులు సమ్మతించటంతో జెడియూ అధ్యక్షుడు శరద్ యాదవ్ అభిశంసన నోటీసును ప్రతిపాదించారు. 'న్యాయ రంగానికి చెందిన కొందరు ఈ విషయంపై నన్ను కలసి, పూర్వాపరాలు వివరించారు. ఆ మహిళా న్యాయమూర్తి వాదనను ఎవరూ పట్టించుకోవటం లేదని, ఇది అభిశంసనకు తగిన కేసని భావించాను' అని శరద్ యాదవ్ వివరించారు.

రాజ్యాంగంలోని 217, 124 అధికరణల కింద గంగేలే తొలగింపునకు తీర్మానాన్ని అనుమతించాలంటూ రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీకి సమర్పించిన నోటీసులో కోరారు. కాగా, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు కనీసం 50 మంది ఎంపీలు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం నోటీసు ఇచ్చినవారిలో 58మంది ఉన్నారు.
మహిళా న్యాయమూర్తిని లైగికంగా వేధించటం.. అక్రమ, అనైతిక కోరికలకు లొంగనందుకు లక్ష్యంగా చేసుకోవటం.. గ్వాలియర్ నుంచి సిధికి బదిలీ చేయించటం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు గంగేలేపై అభిశంసన ప్రక్రియ ఆరంభించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications