స్త్రీలను గౌరవించు: మోడీపై రాహుల్ నిప్పులు
వారాణసి: రోడ్ షో తర్వాత వారణాసిలో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. నేరుగా మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో ఆయన శనివారంనాడు రోడ్ షో నిర్వహించి ఆ తర్వాత ప్రసంగించారు.
"మోడీజీ దయచేసి పద్ధతి మార్చుకోండి. మహిళలను గౌరవిస్తానని చెప్పండి. గుజరాత్లో పోలీసులను పంపడాన్ని, మహిళల ఫోన్లు ట్యాప్ చేయడాన్ని ఆపేయండి. వారికి శక్తి కాదు, గౌరవం ఇవ్వండి" అని రాహుల్ గాంధీ అన్నారు.
ఓపెన్ కారులో రాహుల్ గాంధీ వారణాసిలో రోడ్ షో నిర్వహిచారు. పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. తమ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ని గెలిపించాలని ఆయన కోరారు.
జీవించు, ప్రేమించు, శాంతంగా ఉండు అనే బౌద్ధాన్ని కాంగ్రెసు పార్టీ అనుసరిస్తుందని ఆయన చెప్పారు. భారత వైమానిక దళానికి గుజరాత్లో మోడీ భూమి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అతి తక్కువ ధరకు మోడీ ఆదానీ 45 వేల ఎకరాల పేదల భూమిని కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.