నిరాశతో ధోనీ హఠాత్తు నిర్ణయం: టెస్ట్లకు గుడ్బై, నాలుగో టెస్ట్కి కోహ్లీ
మెల్బోర్న్: భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించి ఓ కుదుపు కుదిపాడు. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. మంగళవారం నాడు మెల్బోర్న్లో మూడో టెస్టు అనంతరం ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆస్ట్రేలియాతో ఇప్పటికి మూడు టెస్టులు జరిగాయి. తొలి రెండు టెస్టుల్లో భారత్ ఓడింది. మూడో టెస్టు డ్రా అయింది. ఈ నేపథ్యంలో ఇదే సరైన సమయమని భావించిన ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా క్రీడా పరిశీలకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు అనంతరం ధోనీ టెస్టులకు దూరం అవుతున్నాడు. వన్డేల్లో మాత్రం కొనసాగుతారు.
మహేంద్ర సింగ్ ధోనీ మొత్తం 90 టెస్టులు ఆడాడు. 4,876 పరుగులు చేశాడు. ధోనీ నాలుగో టెస్ట్ సారథ్య బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించాడు. ధోనీ టెస్టుల్లో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. ధోనీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో విరాట్ కోహ్లీని భావి సారథిగా అందరు కీర్తిస్తున్నారు.
60 టెస్టుల్లో ధోనీ సారథిగా వ్యవహరించాడు. అందులో 27 టెస్టులు భారత్ గెలిచింది. 2005లో శ్రీలంకతో తొలిటెస్ట్ ఆడాడు. టెస్టుల్లో 256 క్యాచ్లు పట్టాడు. 38 స్టంపౌట్లు చేశాడు. టెస్టుల్లో ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 224. ఆసీస్తో సిరీస్ ఓటమి నేపథ్యంలో అతను నిరాశ చెందాడని భావిస్తున్నారు.
బీసీసీఐ మంగళవారం ఇచ్చిన ప్రకటనలో... భారత్ క్రికెట్ను నెంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేసిన గొప్ప క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిపింది. తన రిటైర్మెంట్ వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పాడు. క్రికెట్కు ధోనీ అపార సేవలు అందించాడని పేర్కొంది. బీసీసీఐ అతనికి విషెస్ తెలిపింది. ధోనీ నిర్ణయం పైన గంగూలీ స్పందిస్తూ.. అతను మరికొన్ని రోజులు ఆడతాడనుకున్నానని వ్యాఖ్యానించాడు.
ట్విట్టర్లో ప్రకటన..
ఎమ్మెస్ ధోనీ తాను రిటైర్మెంట్ ప్రకటించినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.