ఎనిమిదోసారి: కుబేరుల జాబితాలో ముకేశ్ టాప్, 16వసారి గేట్స్
న్యూయార్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ వరుసగా ఎనిమిదోసారి భారతీయ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన కుబేరుల జాబితాలో భారత్లో 21 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ తొలి స్థానంలో ఉన్నారు.
అంతర్జాతీయంగా మాత్రం 39వ స్థానంలో ఉండగా, మరోసారి సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్గేట్స్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. గేట్స్ సంపద విలువ 79.2 బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 21 ఏళ్లలో బిల్గేట్స్ ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్ ఉండటం ఇది 16వసారి కావడం గమనార్హం.
గేట్స్ తర్వాతి స్థానాల్లో కార్లోస్ స్లిమ్, వారెన్ బఫెట్ ఉన్నారు. స్పెయిన్కు చెందిన అమనికో ఒర్టెగా 4వ స్థానానికి పడిపోగా, ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జూకర్బర్గ్ 16వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకారు. అలిబాబా వ్యవస్థాపకుడు జాక్మా టాప్-20లో స్థానం సంపాదించారు. ఇక ఈ జాబితాలో 90 మంది భారతీయులకు చోటు దక్కింది.
20 బిలియన్ డాలర్లతో ఔషధరంగ పారిశ్రామికవేత్త దిలీప్ సంఘ్వీ 44వ స్థానంలో, 19.1 బిలియన్ డాలర్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ 48వ స్థానంలో ఉన్నారు. శివ్ నాడార్, హిందుజా సోదరులు, లక్ష్మీ మిట్టల్ టాప్-100లో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 1,826 బిలియనీర్లతో కూడిన ఈ జాబితాలో కుమార మంగళమ్ బిర్లా (142), ఉదయ్ కోటక్ (185), గౌతమ్ అదానీ (208), సునీల్ మిట్టల్ (208), సైరస్ పూనవల్ల (208), అనిల్ అంబానీ (418) కూడా ఉన్నారు. ఈసారి జాబితాలోకి 290 మంది కొత్తవారు రాగా, చైనాకు చెందినవారే 71 మంది ఉన్నారు.