ఎన్నికల తర్వాతే థర్డ్ ఫ్రంట్: ములాయం విశ్వాసం
లక్నో: 2014 ఎన్నికల తర్వాత తృతీయ ఫ్రంట్ ఏర్పడగలదని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడో ఫ్రంట్ 2014 ఎన్నికల తర్వాత ఏర్పడుతుందని, ఇందులో కాంగ్రెసు గానీ బిజెపి గానీ ఉండదని, వచ్చే ఎన్నికల్లో ఈ ఫ్రంట్కు మెజారిటీ వస్తుందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
మూడో ఫ్రంట్ అధికారంలోకి వస్తే ఎవరు నేతృత్వం వహిస్తారని అడిగితే తాము ప్రధాని అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని, ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకుంటామని ఆయన జవాబిచ్చారు. మూడో ఫ్రంట్ ఏర్పాటుపై తాము వామపక్షాలతో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాను సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్తో సమావేశమవుతానని, తృతీయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తానని ఆయన చెప్పారు. సిపిఐ నేత ఎబి బర్దన్తో కూడా తాము మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.
తల్కటోరాలో ఈ నెల 30వ తేదీన జరిగే సమావేశానికి కారత్ తనను అహ్వానించారని, భావసారూప్యం గల మరిన్ని పార్టీల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని ములాయం చెప్పారు. సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.