ములాయంని వెనుకేసుకొచ్చిన కోడలు, సిద్ధూ భార్య ఫైర్
లక్నో/చండీగఢ్: సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైన ఆయన కోడలు, కన్నౌజ్ ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ స్పందించారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యల పైన డింపుల్ ఆయనను వెనుకేసుకొచ్చారు.
ములాయం ఆ సందర్భాన్ని బట్టి నాడు ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ములాయం కోడలు, యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి అయిన డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుండి లోకసభకు పోటీ చేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఆమెను ములాయం వ్యాఖ్యలపై ప్రశ్నించారు. ఈ సమయంలో ఆమె స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు చాలామంది చేస్తున్నారని, అవి చాలా సహజమన్నారు. సందర్భాన్ని బట్టి ములాయం అలా వ్యాఖ్యానించారన్నారు. కాగా, మోరాబాద్ ర్యాలీలో ములాయం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మగవాళ్లు తప్పు చేస్తారని, అయినంత మాత్రా ఉరి శిక్ష వేస్తారా అని వ్యాఖ్యానించారు.
సిద్ధూ భార్య ఫైర్
తన భర్తకు లోకసభ టికెట్ నిరాకరించడంపై బిజెపి నేత వనజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ శిరోమణీ అకాలీదళ్ పార్టీపై మండిపడ్డారు. సిద్ధూ అమృత్సర్ ప్రజల ఆత్మ అని ఆమె అభవర్ణించారు. పొత్తులో భాగంగా ఇరు పార్టీల అభ్యర్థిగా అరుణ్ జైట్లీ అమృత్సర్ నుంచి పోటీ చేస్తున్నారు. సిద్ధూకి టిక్కెట్ దక్కలేదు.