చైనాని నమ్మితే: ములాయం, నేనుండగా డేర్ చేయలేదు
లక్నో: చైనా విషయంలో సమాజ్వాది పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోసకారిలాంటి చైనా పైన ప్రధానమంత్రి నమ్మకం పెట్టుకుంటే భారత సరిహద్దులకు రక్షణ ఉండదని ఆయన చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ సెమినార్ ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని పిరికిపందగా ఆయన వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దులలో పర్వతాల ద్వారా చైనా రహదారులు నిర్మిస్తోందన్నారు. అయితే, ఈ ప్రభుత్వం పిరికిదని, దేశాన్ని రక్షించలేదని విమర్శించారు.
తాను రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో చైనా, పాకిస్థాన్లు దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ధైర్యంచేసేవి కాదన్నారు. ప్రస్తుతం దేశ రక్షణపై పలు ప్రశ్నార్ధకాలు తలెత్తుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సైనిక దళాల్లో ధైర్యాన్ని నింపడం చాలా ముఖ్యమన్నారు.
దేశం ఇప్పటికే ద్రవ్యోల్భణం, అవినీతి వంటి సమస్యలను ఎదుర్కుంటోందన్నారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వారు కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అయితే, దేశ రక్షణ విషయం మాత్రం తనది కాదని, ఇది భారత్ దేశ సమస్య అన్నారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పలుమార్లు డీజిల్, పెట్రోలు రేట్లు తగ్గించడం పైన మాట్లాడుతూ.. దేశంలో 27 శాతం మంది ప్రజలకు ఆహారం సరిగా లభించడం లేదని, 65 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధాల పైన జీవిస్తున్నారని, వాటి పైన దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు.