మేం పంచిన ల్యాప్టాప్లే కొంప ముంచాయి:ములాయం
లక్నో: శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము ఉచితంగా పంపిణీ చేసిన ల్యాప్టాప్లో లోకసభ ఎన్నికల్లో తమ కొంప ముంచాయని సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఆ ల్యాప్టాప్లే కారణమని ఆయన అన్నారు. యువకులుంతా తాము పంపిణీ చేసిన ల్యాప్టాప్ల ద్వారా నరేంద్ర మోడీ ప్రసంగాలు చూసి ప్రభావితులయ్యారని ఆయన అన్నారు.
పార్టీ జాతీయ స్థాయి మహిళా విభాగం సమావేశంలో ఆయన ప్రసంగించారు. 12వ తరగతి పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వడాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించానని ఆయన చెప్పారు. ఆ ల్యాప్టాప్ల ద్వారా మోడీ ప్రసంగాలు విని ప్రజలు ఆకర్షతులైనట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యురాలు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ కూడా హాజరయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. 27లక్షలకు పైగా ల్యాప్టాప్లను ఆయన ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసింది.
ఉచిత ల్యాప్టాప్ల పంపిణీ తమ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయమని అఖిలేష్ యాదవ్ అన్నారు. లోకసభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంతకు ముందటి లోకసభలో ఆ పార్టీకి 22 మంది సభ్యులున్నారు. బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోకసభ స్థానాల్లో 71 సీట్లు గెలుచుకుంది.
నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ములాయం సింగ్ యాదవ్ తప్పు పట్టారు. పేదరికం ఉన్నంత వరకు అటువంటి కార్యక్రమాలతో ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. పరిశుభ్రత అనేది సంపన్నులకు మాత్రమేని, పరిసరాల పరిశుభ్రత గురించి నిజాయితీగా ఆలోచించే వారు పేదరిక నిర్మూలన కోసం కూడా ఆలోచన చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications