అజాంఖాన్కు థాంక్స్ చెప్పిన ములాయం సింగ్ యాదవ్..!
న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ సీనియర్ మంత్రి అజాంఖాన్కు 'గ్రేట్ జాబ్' అంటూ కితాబిచ్చారు. ములాయం సింగ్ యాదవ్ 75వ జన్మదినాన్ని అజాంఖాన్ అంగరంగవైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
దీనికి బదులు ఆ పార్టీ అధ్యక్షుడైన ములాయం సింగ్ యాదవ్ సీనియర్ మంత్రి అజాంఖాన్కు థాంక్స్ చెప్పారు. అజాంఖాన్ మెచ్చుకున్న ములాయం, ‘‘అయినా నా జన్మదినం సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆజాం ఖాన్ ఎక్కడి నుంచి డబ్బు తెస్తే మీకెందుకూ?'' అంటూ మండిపడ్డారు.
‘‘నా జన్మదినం సందర్భంగా 16 కిలో మీటర్ల మేర జనం క్యూ కట్టి మరీ నాకు శుభాకాంక్షలు చెప్పారు. వారంతా డబ్బు తీసుకుని వచ్చిన వారు కాదు. అజాంఖాన్ నా జన్మదినాన్ని గొప్పగా నిర్వహించారు'' అని ములాయం ప్రశంసలతో ముంచెత్తారు.
75 అడుగుల భారీ కేక్తో పాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఆజం ఖాన్, ములాయంకు మరిచిపోలేని రీతిలో పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ములాయం సింగ్ యాదవ్ 75వ జన్మదిన వేడుకలు జరిపేందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజాంఖాన్ వివాదాస్పదంగా స్పందించిన విషయం తెలిసిందే.
తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలకు అయ్యే ఖర్చును అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అబూసలెం, తాలిబన్ చెల్లిస్తారని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకల కోసం వెచ్చించే నిధుల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అజాంఖాన్ పై విధంగా సమాధానం చెప్పారు. అజాంఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాంపూర్లో ములాయం జన్మదిన వేడుకలు భారీ ఎత్తున నిర్వహించారు.