అమ్మాయిని తదేకంగా చూశాడని విద్యార్థిని చంపేశారు
ముంబై: మహారాష్ట్రలోని అహ్మాద్నగర్ జిల్లా రాజ్పూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయిని తదేకంగా చూస్తున్నాడని ఎనిమిదవ తరగతి చదువుతున్న కిరణ్ అనే ఓ విద్యార్థిని తోటి విద్యార్థులే కొట్టి చంపారు. జూన్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ విద్యార్థినిని తదేకంగా చూస్తున్నాడన్న కారణంతో కిరణ్పై కొంతమంది విద్యార్థులు కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో కిరణ్ తలను మొదట స్కూల్ బెంచ్పై బాది అనంతరం పాఠశాల ఆవరణలోని ఓ చెట్టుకేసి తీవ్రంగా కొట్టారు.
అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో దాడికి పాల్పడ్డ విద్యార్థులు అక్కడ్నుంచి పరారయ్యారు. గమనించిన పాఠశాల సిబ్బంది తీవ్రంగా గాయపడిన కిరణ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు.

ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు మొదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురు విద్యార్థులపై పోలీసులు హత్య కేసును నమోదు చేశారు.
తన కొడుకుపై చేసిన ఆరోపణలను విద్యార్థి తల్లి ఖండించింది. తోటి విద్యార్థినులను అక్కాచెల్లెల్లుగా భావిస్తుండేవాడని పేర్కొంది. స్కూల్ ఆవరణలోనే విద్యార్థి చనిపోవడం వంటి ఘటన గడిచిన కొన్ని రోజుల్లో మహారాష్ట్రలో ఇది రెండోసారి.












Click it and Unblock the Notifications