ఆత్మహత్య చేసుకుందామని పిలిచి.. ప్రేయసి హత్య
ముంబై: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తన ప్రియురాలిని ఆత్మహత్య చేసుకుందామని రమ్మన్నాడు. అతడ్ని ఎంతో ప్రేమించిన ఆ యువతి నమ్మి వచ్చింది. అయితే ఆ దుర్మార్గుడు మాత్రం ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రంలోని ముంబైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఈవెంట్ మేనేజర్గా పని చేస్తున్న ప్రసాద్ సావంత్(26), ఏక్తాతల్ వాద్కర్(24) గత కొన్నేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే వీరిద్దరికి నిర్ణయానికి పెద్దల ఆమోదం లభించలేదు.
కలిసి జీవించడం కుదరదని... కలిసే ఈ లోకాన్ని వీడాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆదివారం సాయంత్రం కాలా చౌకీ ఏరియాలో కలుసుకున్నారు. అకస్మాత్తుగా ఏమైందో ఏమో తెలియదుగానీ వెంటతెచ్చుకున్న పదునైన కత్తితో ప్రసాద్ ప్రియురాలిపై దాడి చేసి గొంతు కోశాడు.

అనంతరం అతగాడు పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏక్తాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా, ట్రావెల్ కంపెనీలో పనిచేసే ఏక్తా ఆదాయమే ఆమె కుటుంబానికి ఆధారం. కుటుబానికి పెద్ద దిక్కులాంటి ఏక్తా మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అబ్బాయి మంచివాడు కాదని, అందుకే వారి పెళ్లికి అంగీకరించలేదని తండ్రి అంకుష్ వాపోయాడు.
అయితే నిందితుడు ప్రసాద్ తాగుడుకు అలవాటుపడ్డాడని, హత్య జరిగిన సమయంలో కూడా బాగా మద్యం తాగి ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి సూర్యకాంత్ తరాడే వెల్లడించారు. ప్రసాద్ గత పదిహేను రోజులుగా కత్తితో వెంటబెట్టుకుని తిరుగుతూ, ఒక పథకం ప్రకారమే ప్రియురాలి హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రసాద్పై హత్య కేసు నమోదు చేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications