హోటల్లో పేలిన సిలిండర్: 8మంది సజీవ దహనం
ముంబై: నగరంలోని హోటల్ కిన్నెరలో శుక్రవారం ఓ సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. కుర్లా వెస్ట్ ప్రాంతంలోని సిటీ కినారా హోటల్లో సిలిండర్ పేలినట్లు అధికారులు వెల్లడించారు.
మృతుల్లో ఎక్కువ మంది హోటల్ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిఎం పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇంటి సమీపంలో గ్యాస్బెలూన్ పేలడంతో 11 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శుక్రవారం రోజున నవీన్ పట్నాయక్ జన్మదినం కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి విద్యార్థులు ఆయన ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
పలువురు నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు అధిక సంఖ్యలో ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్తుండగా ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఎయిర్పోర్ట్ స్వ్కేర్ వద్ద ర్యాలీలో తీసుకెళ్తున్న గ్యాస్బెలూన్ పేలింది.
9 మంది విద్యార్థినులు సహా 11 మంది స్వల్పంగా గాయపడ్డారు. రమాదేవి మహిళల యూనివర్సిటీకి చెందిన విద్యార్థులే గాయపడిన వారిలో ఎక్కువగా ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎవ్వరూ తీవ్రంగా గాయపడలేదని.. అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బినోద్ మిశ్రా తెలిపారు. గ్యాస్ బెలూన్ పేలడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. టపాకాయలు కాల్చిన కారణంగా నిప్పు పడి గ్యాస్ బెలూన్ పేలి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు పోలీసులు తెలిపారు.