విషాదం: లిఫ్ట్ కిందపడి కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మృతి
ముంబై: రిటైల్ చైన్ కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మెవానీ(46) ముంబై వర్లీలోని ఓ భవనం లిఫ్ట్ కిందపడి మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం లోయర్ ప్యారెల్లోని కార్యాలయంలో తన పని ముగించుకున్న విశాల్ మెవానీ.. తన కూతురు రేషమ్తో కలిసి వర్లీలోని రెండస్తుల బ్యూనె విస్తా భవనంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. వీరిద్దరూ కాసేపటి వరకు లిఫ్టు కోసం వేచిచూశారు. అయితే, లిఫ్ట్ రాకముందే ఏదో ఆలోచనలో ఉన్న మెవానీ.. అందులోకి అడుగేసి పడిపోయాడు.
ఆ తర్వాత లిఫ్ట్ వచ్చి అతనిపై పడింది. వెంటనే అగ్నిప్రమాద సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. లిఫ్టును పైకి పంపి మెవానీని బయటికి తీశారు. ఆ తర్వాత బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. కానీ, అప్పటికే మెవానీ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
పంటి నొప్పితో బాధపడుతున్న మెవానీ... దంత వైద్యుడైన అతని స్నేహితుడి ఇంటికి వెళ్లిన క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. తండ్రి మరణంతో మెవానీ కూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.